Chamala Kiran Kumar Reddy: లోక్సభ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ పునర్విభజన చట్టంపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి కేవలం తన ఉనికిని చాటుకోవడానికే ప్రయత్నించారని, తెలంగాణ అభివృద్ధిపై కాకుండా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని చామల మండిపడ్డారు. తెలంగాణలో ఆర్.ఆర్ ట్యాక్స్ నడుస్తోందంటూ కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న, కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గమనించారు కాబట్టే వారిని ఇంటికి పంపి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చామల గుర్తు చేశారు.
కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారని చామల ఎద్దేవా చేశారు. “బీఆర్ఎస్ పదేళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో కిషన్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? అని నిలదీశారు. వాళ్ళు దోచుకుంటుంటే కిషన్ రెడ్డి దాచుకున్నారని, అందుకే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదని చామల ప్రశ్నించారు. కిషన్ రెడ్డి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాల గురించి తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏ నాడైనా ప్రధాన మంత్రి దగ్గర తెలంగాణ నిధుల గురించి మాట్లాడారా అని చామల నిలదీశారు. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో ఫేజ్-2 వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధులు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటును కిషన్ రెడ్డి భర్తీ చేస్తున్నారని, ఆయన చదివిన స్క్రిప్ట్ అంతా బీఆర్ఎస్ రాసిందేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తన అవయవదానం ద్వారా బీజేపీకి 8 లోక్సభ సీట్లు ఇచ్చిందని, అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి వారి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని చామల విమర్శించారు. కిషన్ రెడ్డి తన పద్ధతి మార్చుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు.