MP Dharmapuri Arvind: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మే 10వ తేదీన తెలంగాణకు వస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని.. బెంగాల్ గెలుపు ముందు రేవంత్ రెడ్డి, కేసీఆర్ వంటి నేతలు తనకు లిల్లిపుట్లాగా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మోదీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. “సభ అంటే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆరోజు చూడాలి.” అని సవాలు విసిరారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో పునాది వేయడానికే మోదీ ఈ పర్యటన చేస్తున్నారని అరవింద్ పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా తెలంగాణలో కూడా ‘ఎస్ఐఆర్’ (SIR – అవసరమని.. అది జరిగి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తో బీజేపీకి ఎలాంటి పొత్తులు ఉండవని.. ఈ విషయంలో తమ పార్టీ అధిష్టానం ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ.. తెలంగాణలో ఆస్తులు అమ్మితే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అరవింద్ ఆరోపించారు. “అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిన ముఖ్యమంత్రి నాశనం అవుతాడు.” అని శాపనార్థాలు పెట్టారు అరవింద్. రేవంత్ రెడ్డి రాజకీయంగా, శారీరకంగా ఇకపై ఎదగరని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వందేళ్లు బతకాలని.. అయితే ఆయనకు టీవీ పెట్టి బీజేపీ విజయాలను చూపించాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవని.. బీజేపీ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాకతో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందని.. రాష్ట్రంలో రాబోయే కాలం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: తమిళనాడు ప్రజలు స్టాలిన్కు గుణపాఠం చెప్పారు: బండి సంజయ్