Mallu Ravi: మే 1వ తేదీ నుంచి పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచడం దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం చూపుతోంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఏకంగా రూ. 993 పెంచడంతో ఒక్కసారిగా ధరలు మూడు వేల మార్కును దాటేశాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ. 3,069కి చేరింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి దీనిపై తీవ్రంగా స్పందించారు.
పెట్రోలియం.. సహజ వాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు.. ఎంపీ డాక్టర్ మల్లు రవి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరల పెంపు కంటే కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగితే దాని ప్రభావం కేవలం కొనుగోలుదారులపైనే కాకుండా.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇతర చిరు వ్యాపారాలపై ఆధారపడే సామాన్య వినియోగదారులపై నేరుగా పడుతుందని ఆయన విశ్లేషించారు. దీనివల్ల నిత్యావసరాలు.. ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి వంచించిందని మల్లు రవి మండిపడ్డారు. ధరలు పెంచబోమని గతంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాటను తప్పడం ద్వారా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ధరల సాకు చూపిస్తూ దేశీయంగా ప్రజల నడ్డి విరవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ప్రయోజనాలను.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల వల్ల వ్యాపార రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఉందని.. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం మొండివైఖరిని వీడకపోతే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Also: బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై.. ఎల్ఐసీలో మాత్రం!