తెలంగాణలో మున్సిపోల్స్ ప్రధాన రాజకీయ పార్టీ నేతలకు కనకవర్గాన్ని కురిపిస్తున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే జరగనున్న ఎన్నికల నేపథ్యంలో చైర్మన్, చైర్ పర్సన్, మేయర్ పదవుల కోసం భారీగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు. తమకంటే తమకే చాన్స్ ఇవ్వాలని ఇప్పటికే పార్టీల అగ్రనాయకులను కలిసి ఓ రేటు ఫిక్స్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే అగ్రతాంబూలం దక్కుతుందని నేతల నుంచి వారికి భరోసా వెళ్లినట్టు చర్చ జరుగుతున్నది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫు నుంచి పోటీ చేస్తున్న కొందరు ముందుగానే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో ఎన్నికలు జరుగుతున్న స్థానాలకు భారీ డిమాండ్ ఉన్నది. కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు సైతం కొందరు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కౌన్సిలర్ స్థానానికి రూ.50 లక్షలకు వరకు రేటు పలుకుతుండగా.. ఇక కార్పొరేటర్గా పోటీకి కొన్ని పార్టీలు రూ.1 కోటి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సొంత పార్టీ నేతల నుంచే పార్టీ అగ్రనేతలు డిమాండ్ చేస్తుండటంతో వారు వాపోతున్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసి నాయకులను గెలిపిస్తే తమ దగ్గరే డబ్బులు అడుగుతారా? అని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరికొందరైతే డబ్బులు ఇచ్చే స్థోమత లేక స్వతంత్రంగా పోటీకి దిగుతున్నట్టు సైతం ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా నియోజకవర్గాన్ని బట్టి నేతలు రేటు ఫిక్స్ చేస్తున్నట్టు సమాచారం. కార్పొరేషన్, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని బట్టి అభ్యర్థుల సీట్లకు రేటు ఫిక్స్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, రామగుండం వంటి కార్పొరేషన్లకు భారీ రేటు చెబుతున్నట్టు తెలుస్తున్నది. కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు రూ.1కోటి పలికితే చైర్మన్, మేయర్ స్థానాలకు ఇంకెంత పలకాలని నేతల మధ్య పెద్దఎత్తున చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పార్టీ పెద్దలకు తెలిసే జరుగుతున్నదా? లేక జిల్లా ఇన్చార్జి నేతలే ఈరేట్లు ఫిక్స్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఏదైమైనా అసలైన పార్టీ కార్యకర్తలకు బడా నేతలు మొండిచేయి చూపిస్తున్నారని.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి లేదా డబ్బులు పెట్టే వారికే టికెట్లు దక్కుతున్నాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉన్న అభ్యర్థులు రిజర్వేషన్ల వారీగా చూసుకుని చైర్మన్, మేయర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే, మేజర్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఆ పదవులకు రూ.2 నుంచి 5కోట్ల వరకు పార్టీ అగ్రనేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి అభ్యర్థులు ఒక్కసారిగా నోరెళ్ళబెట్టినట్టు తెలుస్తున్నది. డబ్బులు ఉన్న వాళ్లు మాత్రం తమకే సీటు కన్ఫమ్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. చివరి వరకూ మేయర్, చైర్మన్ స్థానాలకు ఇలాగే అంతర్గత వేలం జరుగుతుందని… ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆ స్థానాలు ఎవరికి దక్కుతానేది క్లారిటీ వస్తుందని తెలుస్తున్నది. ఇదిలాఉంటే, టికెట్లు రాని వారు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. అందుకోసం ప్రతిఫలంగారు వారు డబ్బులు,ఖరీదైన బహుమతులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.