రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిన వేళ, ప్రచార గడువు ముగియడంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో.. అధికారికంగా ప్రచార హోరుకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రచార గడువు ముగిసిన సమయం నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు ‘సైలెంట్ పీరియడ్’ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు గానీ, రాజకీయ పార్టీలు గానీ ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయకూడదు. ఎలక్షన్ కు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు లేదా ఎలాంటి ప్రచార అంశాలను బహిరంగంగా డిస్ ప్లే చేయడంపై నిషేధం విధించారు. ముఖ్యంగా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా ఈవెంట్లు చేయడం, విందులు ఇవ్వడం లేదా బహుమతులు పంపిణీ చేయడం వంటి పనులు చేస్తే కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
సోషల్ మీడియా వినియోగంపై కూడా ఎన్నికల సంఘం డేగ కన్ను వేసింది. ప్రచార గడువు ముగిసిన తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా పరోక్షంగా కూడా ప్రచారం చేయకూడదని SEC పేర్కొంది. డిజిటల్ మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా, అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించినా ఐటీ చట్టంతో పాటు ఎన్నికల నిబంధనల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా మున్సిపల్ ఆక్ట్ సెక్షన్ 209 కింద పొందుపరిచిన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. అభ్యర్థులైతే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని SEC స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మద్యం పంపిణీ, నగదు తరలింపుపై నిఘా పెంచామని, ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ALSO READ: KTR: తులం బంగారం ఏమైంది..? రేవంత్ సర్కార్పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్