తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. భూపాలపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే రెండేళ్లలో రాజకీయ సమీకరణాలు మారతాయని, మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించే వారిని ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని, తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ‘ముగ్గురు పిల్లలున్నాక ముహూర్తం పెట్టినట్లుంది రేవంత్ తీరు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో చేరేవని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా అతీగతీ లేదని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భూపాలపల్లి జిల్లా అస్తిత్వంపై వస్తున్న వార్తలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని రేవంత్ అనడం హాస్యాస్పదం. అసలు జిల్లాను తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆర్. జిల్లాను రద్దు చేసే సాహసం చేస్తే ప్రజలు నీ వీపు చింతపండు చేస్తారు’ అని హెచ్చరించారు. గత రెండేళ్లలో ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం సింగరేణి కాంట్రాక్టులను తన బామ్మర్దికి కట్టబెట్టారని, బొగ్గు కుంభకోణంపై తాము గొంతు ఎత్తితే ఫేక్ నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్లో నిప్పు పెట్టించి ఫైళ్లను తగులబెట్టించారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణను గతంలో ఆగం చేసింది కాంగ్రెస్సేనని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లు చైతన్యవంతులు కావాలని, తులం బంగారం ఎప్పుడిస్తావని కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకుని అడగాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు. ‘బూతుల ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్లోనే కర్రుకాల్చి వాత పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. భూపాలపల్లిలోని అన్ని వార్డుల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు ఫైర్..
కాగా.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రేవంత్ సర్కార్పై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
ALSO READ: Harish Rao: కేసీఆర్ రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ సున్నం పెట్టింది, హరీష్ రావు ధ్వజం