Rice Mill Scam: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ ధాన్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతమైంది. 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో పోలీసులు ఈ అక్రమాలపై లోతైన దర్యాప్తు చేపట్టి, కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
2022-23 యాసంగి కాలంలో జిల్లాలోని ఏడు రైస్ మిల్లులకు ప్రభుత్వం సుమారు 7.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ (CMR) కోసం కేటాయించింది. అయితే.. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి, బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యానికి, రికార్డులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ఏడు మిల్లుల ద్వారా సుమారు రూ. 42.80 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు వ్యక్తిగత లాభాల కోసం మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలతో విచారణను వేగవంతం చేశారు.
Also Read: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?