Jagitial News: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామంలో రేబీస్ వ్యాధి కలకలం రేపింది. ఒక గేదె మృతి చెందడం, ఆ గేదె పాలు తాగిన సుమారు 30 మంది గ్రామస్థులు ఆందోళనతో టీకాలు వేయించుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజుల క్రితం వేంపేట్ గ్రామానికి చెందిన ఒక పాడి రైతు గేదెను వీధి కుక్క కరిచింది. ఆ తర్వాత సదరు గేదెలో రేబీస్ లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో ఆ గేదె నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. అయితే.. గేదె అనారోగ్యానికి గురై చనిపోయే ముందు వరకు దాని పాలను ఆ రైతు కుటుంబంతో పాటు మరికొందరు గ్రామస్థులు వినియోగించారు.
రేబీస్ సోకిన జంతువు పాలు తాగడం వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్న భయంతో గ్రామస్థులు వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు.. సుమారు 30 మంది ముందస్తు జాగ్రత్తగా రేబీస్ నిరోధక టీకాలు (Anti-Rabies Vaccine) వేయించుకున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. గ్రామంలో భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు.
Also Read:పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!