ATM Robbery: నిజామాబాద్ జిల్లాలో జరిగిన భారీ ఏటీఎం దోపిడీ ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో వ్యవహరించిన అంతర్రాష్ట్ర ముఠా, నగరాన్ని అల్లాడించింది. సాయి నగర్ లోని ఎస్బీఐ ఏటీఎం నుంచి సుమారు 10 లక్షల రూపాయలు, ఆర్యనగర్ లోని డీసీబీ ఏటీఎం నుంచి ఏకంగా 27 లక్షల రూపాయలను గ్యాస్ కట్టర్ల సాయంతో దోచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు వాడిన గ్యాస్ కట్టర్ల వేడికి ఏటీఎంలోని కొంత నగదు కాలిపోయి బూడిదైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దారుణానికి పాల్పడింది మహారాష్ట్ర లేదా రాజస్థాన్కు చెందిన ఐదుగురు సభ్యుల ప్రొఫెషనల్ ముఠా అయి ఉండవచ్చని డీసీపీ బస్వారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వీరు కేవలం దోపిడీ చేయడమే కాకుండా, ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏటీఎంలోని సీసీ కెమెరాలకు స్ప్రే పెయింట్ వేసినట్లు తెలుస్తుంది. నిందితులు పక్కా ప్లాన్తో వచ్చి, అతి తక్కువ సమయంలోనే పని ముగించుకొని పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా సంఘటనా స్థలాలను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్ టీమ్, నిందితులు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉంది. ముఠా కదలికలను బట్టి వారు సరిహద్దు దాటి వెళ్లకుండా పక్క రాష్ట్రాల పోలీసులను కూడా తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు.
Also Read: మహబూబాబాద్లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం
అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పాటు పాత నేరస్తుల రికార్డులను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు పెంచాలని బ్యాంక్ యాజమాన్యాలకు పోలీసులు సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీల కలకలం
ఒకే రోజు రెండు ATMలో చోరీ చేసిన దుండగులు
వర్ని చౌరస్తాలో ఎస్బీఐ ATMకు నిప్పు
మిషన్లో ఉన్న రూ.27 లక్షల నగదు దగ్ధమైనట్లు సమాచారం
అదే రోజు మరో ATMను చోరీ చేసిన దుండగులు
ముందస్తు పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన దుండగులు pic.twitter.com/N1qYElbQpj
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025