Woman Job Fraud: నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాల ఆశతో ఉన్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని.. ఓ కిలేడీ ఘరానా మోసానికి పాల్పడింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వంటి ఉన్నతాధికారుల సంతకాలను నకిలీగా తయారు చేసి.. నియామక పత్రాలు జారీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో.. ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులు ఈ మాయ లేడీ వలలో చిక్కినట్లు సమాచారం. ఉద్యోగం వస్తుందన్న ఆశతో తమ తమ దగ్గరున్న డబ్బులన్ని ఆమె చేతిలో పెట్టి ఇప్పుడు లబోదిబోమంటున్నారు బాధితులు.
ఈ కిలేడీ తాను కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానంటూ.. నిరుద్యోగులకు ఫోన్ చేసి నమ్మబలికేదని తెలుస్తోంది. అధికారిక భాషలో మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల పేర్లు ప్రస్తావిస్తూ ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పడంతో.. చాలామంది ఆమె మాటలను నమ్మారు. అంతేకాకుండా తాను ఆర్ అండ్ బి శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకుని విశ్వాసం కలిగించిందని బాధితులు చెబుతున్నారు.
కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందజేస్తానంటూ అధికారిక లెటర్హెడ్లపై ముద్రలు, ఉన్నతాధికారుల సంతకాలు ఉన్నట్లు కనిపించే నకిలీ పత్రాలు అందజేసింది. మొదట వాటిని చూసినప్పుడు ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నించగా అవి పూర్తిగా నకిలీవని బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నియామక పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమను మోసం చేసిన కిలేడీ కోసం వెతకగా ఆమె అందుబాటులో లేకపోవడంతో.. మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
పోలీసులు ప్రాథమికంగా పరిశీలించిన పత్రాలు అన్నీ ఫోర్జరీ చేసినవేనని నిర్ధారించారు. ఉన్నతాధికారుల సంతకాలను స్కాన్ చేసి, కంప్యూటర్ సహాయంతో నకిలీగా తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? బ్యాంక్ లావాదేవీలు ఎలా జరిగాయి? ఎంతమంది నిరుద్యోగుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే అధికారిక నోటిఫికేషన్, పరీక్షలు తప్పనిసరిగా ఉంటాయని, డబ్బులు అడిగేవారిని నమ్మకూడదని సూచిస్తున్నారు.