Municipal Elections: నిజామాబాద్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని.. ఫిబ్రవరిలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలు రాష్ట్రంలో 85 శాతం మందికి లబ్ధి చేకూరుస్తాయని, ఇవే రాబోయే ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్స్’గా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పనితీరు ఆశాజనకంగా లేదని, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఓటమిని చవిచూశామని ఆయన గుర్తు చేశారు. అయితే.. ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని, ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని, వచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘మన నిజామాబాద్ – మన అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు సాగుతామని, నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించామని, శాస్త్రీయంగా నిర్వహించే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
బీజేపీపై విరుచుకుపడుతూ.. ఎంపీ అర్వింద్ కేవలం హిందూ ధర్మం పేరుతో గెలిచారని, దేవుళ్ల పేరుతో ఓట్లు అడగడం కాంగ్రెస్ సంస్కృతి కాదని విమర్శించారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసేవారు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారని ఎద్దేవా చేశారు. ‘కాగ్రెస్ పార్టీ బీజేపీకి ఎంత దూరమో, మజ్లిస్ (AIMIM) కు కూడా అంతే దూరం’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఆతృత పడొద్దని, ప్రలోభాలకు గురిచేస్తే టికెట్లు రావని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. టికెట్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. కులమతాల పేరుతో ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేసే శక్తులను చూస్తూ ఊరుకోమని, అబద్ధాలతో విషాన్ని నింపుతున్న బీజేపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు
2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ : మంత్రి ఉత్తమ్
ఫిబ్రవరిలో పోలింగ్ ఉంటుంది
కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మాకు గేమ్ ఛేంజర్
మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది
మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ కి ఎంతో ప్రతిష్టాత్మకం
మళ్లీ రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే… pic.twitter.com/LNGaMWZjHh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2026