Tollywood Ticket Rates: తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ ధరల విషయం పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెరగడం వల్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో టికెట్ ధరల పెంపుపై కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి కూడా వస్తోంది. ఈ పరిస్థితి వల్ల నిర్మాతలు, థియేటర్ యజమానులు, ప్రేక్షకులు – అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో సినిమాల టికెట్ ధరలు పెంచాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీఓ (GO) రావాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లో వేర్వేరు.. విధానాలు ఉండటం వల్ల సినిమాల విడుదల సమయంలో గందరగోళం ఏర్పడుతోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల ప్రీమియర్ షోలు..ఫస్ట్ డే కలెక్షన్లపై ఈ సమస్య ప్రభావం చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. టికెట్ ధరల విషయంలో ఒకే విధమైన, స్పష్టమైన విధానం తీసుకురావాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. టికెట్ పాలసీని సినిమాల బడ్జెట్, సినిమా స్థాయి, థియేటర్ల రకాన్ని బట్టి నిర్ణయించాలని నిర్మాతలు అనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టికెట్ ధరల విధానాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు తెలంగాణలో కూడా ఈ పాలసీకి మద్దతు రావాలని నిర్మాతలు, నటులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ ప్రతిపాదనను వివరించాలనే యోచనలో ఉన్నారు.
ఈ కొత్త టికెట్ పాలసీ అమల్లోకి వస్తే, ప్రతి సినిమా విడుదలకు ముందు జీఓ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. అలాగే కోర్టుల్లో కేసులు పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. గతంలో జీఓలు ఆలస్యంగా రావడం వల్ల ప్రీమియర్ షోల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
మొత్తం పైన.. టాలీవుడ్లో ఒక స్థిరమైన టికెట్ విధానం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పాలసీకి ప్రభుత్వాల ఆమోదం లభిస్తే, నిర్మాతలకు స్పష్టత వస్తుంది. ప్రేక్షకులకు కూడా న్యాయమైన ధరలకు సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. రాబోయే వేసవి సినిమాల విడుదలకు ముందే ఈ విషయంలో స్పష్టత రావాలని అందరూ ఆశిస్తున్నారు.
ALSO READ: Vijay Devarakonda: రౌడీ బాయ్ ముందు పెద్ద సవాల్.. రెండు యాసల్లో మాట్లాడనున్న విజయ్ దేవరకొండ..