Republic Day of India 2026: ప్రతి ఏడాది జనవరి 26 రాగానే మనందరిలోనూ తెలియని ఉత్సాహం మొదలవుతుంది. స్కూల్ రోజుల్లో జెండా వందనం చేసిన జ్ఞాపకాలు, టీవీలో ఢిల్లీ పరేడ్ చూస్తూ గర్వపడటం.. ఇవన్నీ ప్రతి భారతీయుడి జీవితంలో ఒక భాగమే. అయితే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్ల వరకు మనకు సొంత చట్టాలంటూ లేవట. ఆ తర్వాతే మనం అసలైన రిపబ్లిక్ దేశంగా మారాం.
విచిత్రం ఏంటంటే.. మన రాజ్యాంగం 1949 నవంబర్లోనే రెడీగా ఉన్నా, దాన్ని అమలు చేయడానికి మన పెద్దలు మరో రెండు నెలలు వెయిట్ చేశారంట. అసలు రాజ్యాంగం పూర్తయ్యాక కూడా ఎందుకు ఆగిపోయారు? ఆ ప్రత్యేకమైన రోజు వెనుక ఉన్న చారిత్రక రహస్యం ఏంటి? ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఆ ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..
1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశాన్ని నడిపించే సొంత చట్టం లేదు. అప్పటివరకు బ్రిటిష్ వారు రూపొందించిన నిబంధనలే అమల్లో ఉండేవి. ఈ లోటును తీర్చడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభ అహోరాత్రులు శ్రమించింది. సుమారు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు ప్రపంచంలోని ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన దేశానికి సరిపోయే అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు.
Also Read: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మన రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీనే పూర్తిగా సిద్ధమై, రాజ్యాంగ సభ ఆమోదం పొందింది. చరిత్రను బట్టి చూస్తే ఆ రోజే మనం గణతంత్ర దేశంగా మారిపోవాలి. కానీ, మన నాయకులు మరో రెండు నెలలు ఆగి, జనవరి 26, 1950 వరకు వేచి చూశారు. ఈ నిరీక్షణ వెనుక ఒక బలమైన సెంటిమెంట్, చారిత్రక నేపథ్యం దాగి ఉంది.
1930లో భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ వేదికగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో రావినది తీరంలో భారతీయులంతా ‘సంపూర్ణ స్వాతంత్ర్యం’ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు జనవరి 26. ఆ తేదీ భారతీయుల పోరాట పటిమకు గుర్తుగా నిలిచిపోయింది. ఆ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రోజునే మన రాజ్యాంగం అమల్లోకి రావాలని, దీంతో ఆ రోజుకు శాశ్వత గౌరవం దక్కాలని మన పెద్దలు భావించారు.
జనవరి 26 అనేది కేవలం తేదీ మాత్రమే కాదు.. అది భారతీయుల ఆత్మగౌరవానికి సంబంధించినది కూడా. ప్రతి ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే వేడుకలు కనువిందు చేస్తాయి. రాష్ట్రపతి జెండా ఎగురవేయడం, 21 తుపాకుల సెల్యూట్, భారత సైనిక దళాల పరాక్రమం, వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే శకటాలు.. ఇవన్నీ చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఇది కేవలం మన శక్తి ప్రదర్శన మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన విజయానికి చిహ్నం.
గణతంత్ర దినోత్సవం అంటే.. కేవలం టీవీల్లో పరేడ్ చూడటమో లేదా సెలవును ఆస్వాదించడమో కాదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనకు అందించిన హక్కులను, బాధ్యతలను స్మరించుకునే రోజు. పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా ఎగురవేస్తూ మనం దేశాభివృద్ధిలో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేయాలి.
Also Read: గంటకు 115 కి.మీ వేగంతో దూసుకొచ్చిన వరద.. మధ్యధరా సముద్రాన్ని పుట్టించిన భయంకర ప్రళయం ఇదే!