Alwal Fire Accident: మేడ్చల్ జిల్లాలోని అల్వాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిటిజన్ కాలనీలోని నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న ఏసీలు ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగి, క్షణాల్లో ఐదో అంతస్తుకు వ్యాపించాయి.ఈ ఘటన జరిగిన సమయంలో హాస్టల్లో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు.
భవనం చుట్టూ పూర్తిగా గ్లాస్ ఫిట్టింగ్ ఉండటంతో.. మంటల వల్ల వచ్చిన దట్టమైన పొగ బయటకు వెళ్లే మార్గం లేక లోపలే పేరుకుపోయింది. దీంతో ఊపిరి ఆడక విద్యార్థులు తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పొగ ధాటికి ఆరుగురు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మొత్తం నాలుగు అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ కోల్పోయిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ డిజైన్ వల్ల పొగ బయటకు పోకపోవడమే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
ALSO READ: లక్షలాది భక్తులకు భరోసా.. మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు