విమర్శలే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ పని తలపెట్టినా ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూనే ఉన్నది. మొన్నటివరకు గ్లోబల్ సమ్మిట్ను టార్గెట్గా పెట్టుకున్న రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కొత్తగా ఫుట్బాల్ మ్యాచ్ను ఎంచుకున్నాయి. సీఎం రేవంత్ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని, సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ప్రభుత్వ పాఠశాలల కోసం వెచ్చించాలని, సంక్షేమం కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ఈవెంట్స్ విషయంలోనే ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవినీతి చేస్తున్నదని, నిధుల దుర్వినియోగం చేస్తున్నదనే అంశం గుర్తొస్తుందా? అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకే నెలలో రెండు గొప్ప ఈవెంట్స్ నిర్వహించింది. ఈనెల 8,9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ను నిర్వహించింది. దీనికి 44 కు పైగా ప్రపంచదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. రెండ్రోజుల్లో ప్రభుత్వంతో పలు ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దానివిలువ సుమారు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అదంతా ప్రభుత్వం చేస్తున్న ప్రచారమే తప్పా.. అందులో వాస్తవం లేదని ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. తెలంగాణ గొప్పతనం ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ప్లాప్ అయ్యిందని ప్రతిపక్షం ఆరోపించింది.
అర్జంటీనా ఫుట్ బాట్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా పర్యటన ఖరారు కాగానే ఆయన షెడ్యూల్లో హైదరాబాద్ టూర్ లేకపోయినా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా మెస్సీ బృందంతో సంప్రదింపులు జరిపి ఆయన హైదరాబాద్ వచ్చేలా కృషి చేసిందని సమాచారం. అందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఆయన హైదరాబాద్ వస్తే ప్రపంచ దేశాలు మరోసారి తెలంగాణపై దృష్టి సారిస్తాయని తద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం బయటకు ప్రచారం చేయకపోవడంతో ప్రతిపక్షాలు దాన్ని వేరే కోణంలో ప్రచారం చేస్తున్నాయని టాక్.
ఇదిలాఉండగా, సీఎం రేవంత్.. ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు ఉప్పల్ మైదానంలో ఏర్పాట్లు చేయించారు. ఈ ఏర్పాట్లను ప్రభుత్వమే చేయించిందని,అందుకు రూ.100 కోట్ల సింగరేణి నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరం రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, అటు బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. కాగా, ఇది ప్రభుత్వ ఈవెంట్ కాదని, ప్రైవేట్ కార్యక్రమమని.. ప్రభుత్వ నిధులు వెచ్చించలేదని సీఎం రేవంత్ ఇదివరకే ప్రకటించారు.అయితే, శనివారం జరిగిన మ్యాచ్ లో సీఎం రేవంత్, మెస్సీ మ్యాచ్ చివరి 5 నిమిషాల పాటు మైదానంలో కనిపించారు. ఒకరినొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ లీడ్ చేసిన సింగరేణి జట్టు విజయం సాధించింది. షూటౌట్ పెనాల్టీ షాట్లో సీఎం రేవంత్ గోల్ కొట్టగా.. మెస్సీ చప్పట్లతో అభినందించారు.అంతర్జాతీయ స్టార్ను హైదరాబాద్కు రప్పించడం, ఆయనతో మ్యాచ్ ఆడటంతో సీఎం రేవంత్కు వచ్చిన క్రెడిట్ దక్కకుండా చేసేందుకే ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.