Pawan Kalyan: తెలంగాణలో అడుగుపెట్టనివ్వమంటూ విమర్శిస్తున్న నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 2 తెలంగాణ ఆవీర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలని కోరుకునేవారిలో తాను ఒకడినని అన్నారు.
హైదరాబాద్ లో మీకేం పని అని కొందరు ప్రశ్నిస్తుంచడాన్ని ఈ సందర్భంగా పవన్ ప్రస్తావించారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? నాపై దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు ఎక్కువ బెదిరింపులు వచ్చాయని అన్నారు. కోనసీమలో అయితే తలతీసేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. వాటితో పోలిస్తే.. తెలంగాణ నేతల బెదిరింపులు తక్కువేనని అన్నారు.
తెలంగాణ సంస్కృతికి గానీ, రాష్ట్ర ఏర్పాటుకు గానీ జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది తెలంగాణ ప్రజానీకం అని పవన్ అన్నారు. గతంలో వారాహీని ఆంధ్రాలో తిరగనివ్వమని అప్పటి పాలకులు అంటుంటే.. వారాహీకి అనుమతి ఇచ్చింది ఇక్కడి ప్రజలు అని పవన్ గుర్తుచేశారు. ఆంధ్రాలో అడుగుపెట్టనివ్వమని అప్పటి వైసీపీ నేతలు అంటే.. కోదాడ, నల్గొండ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తనకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
2019 ఏపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నేతలు తనతో ఒకమాట అన్నారని పవన్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ఉంటే మీకు ఈ పరిస్థితి రానిచ్చేవారం కాదని వారు పేర్కొన్నారని చెప్పారు. తనపై ఎవరైనా దాడి చేయాలంటే సంతోషంగా వచ్చి చేయవచ్చని పవన్ సూచించారు. ఇదే తన ఇంటి అడ్రస్ అంటూ తనను బెదిరిస్తున్నవారికి చురకలు అంటించారు. తనకు ఎలాంటి భయాలు లేవని.. బాంచన్ కాళ్లు మెుక్కుతా అనే మనస్తత్వాలు ఉంటే పార్టీ ఎందుకు పెడతానని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల కాలంలో కేసీఆర్ గురించి గానీ, ఏ ఇతర నేతల గురించి కానీ ఒక్క మాట అనలేదని పవన్ గుర్తుచేశారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని అందుకే చాలా వరకూ తగ్గి మాట్లాడానని జనసేనాని అన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా.. ఆంధ్రా వాడంటూ విమర్శించినా తన గుండెల్లో తెలంగాణ ఉందని అనుకుంటూ మిన్నకుండిపోయానని చెప్పారు. అయితే వైసీపీ గుండాలు చంపేస్తామన్న స్థాయిలో బెదిరించారని.. అయితే ఆ రేంజ్ వార్నింగ్స్ తెలంగాణ నుంచి రాలేదని పవన్ అన్నారు.
Also Read: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదంపైనా పవన్ స్పందించారు. అమిత్ షా, తాను కూర్చొని మాట్లాడుకున్నట్లు తప్పుడు మాటలు మాట్లాడితే దానిని ఖండించినట్లు పవన్ తెలిపారు. అయితే ఆయనపై జనసైనికులు కేసులు పెట్టిన అంశం కూడా తనకు తెలియదని అన్నారు. ఆ తర్వాత వాటి గురించి తెలిసి.. కేసులు వద్దు, అవన్నీ వదిలేయమని చెప్పినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రెస్ క్లబ్ లోకి వెళ్లి మీడియా సమావేశం పెట్టి తనను తిట్టడాన్ని పవన్ తప్పుబట్టారు. ఇక ఎంతకాలం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నా.. ఇక్కడి ప్రజలకు ఉపాధి లేకపోయినా దానికి పవన్ కళ్యాణే కారణమని చెబుతారా? అని ప్రశ్నించారు.