Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి తెలుసుకుంటే ఈ కేసు తీవ్రత ఏంటో అర్థమవుతుందని, ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఈ దేశంలో చట్టప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు తన ఫోన్ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల్లో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ను ఒక ఆయుధంగా వాడుకుందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, సినిమా నటీమణులు మరియు వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన చర్య అని, ఇందులో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. అరెస్టయిన అధికారులు ఇస్తున్న వాంగ్మూలం ఆధారంగానే విచారణ ముందుకు సాగుతోందని, ఇది ఏమాత్రం రాజకీయ వేధింపు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయ వేధింపులకు పాల్పడాలనుకుంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని జైలుకు పంపే వాళ్ళమని, విచారణ కోసం రెండేళ్ల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే ప్రభాకర్ రావు వంటి వారు విదేశాల్లో దాక్కుంటున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!