ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ విచారణ దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావును పలు కోణాల్లో ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
విచారణాధికారులు హరీష్ రావు నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి రికార్డులను, సాక్ష్యాలను ఆయన ముందు ఉంచి వివరణ కోరినట్లు సమాచారం. అధికారులు హరీష్ రావు వెల్లడించిన అంశాలను వీడియో రూపంలో, లిఖితపూర్వకంగా రికార్డ్ చేసుకున్నారు. విచారణ పొడవునా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్కు బయలుదేరారు. అక్కడ ఆయన పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అనంతరం కొద్దిసేపట్లో ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. విచారణలో ఏం జరిగింది? అధికారులు ఏయే అంశాలపై ప్రశ్నించారు? అనే విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ALSO READ: Fake Challan: హైదరాబాద్ వాసులూ.. ట్రాఫిక్ చలానా కట్టే ముందు జాగ్రత్త..! మోసగాళ్ల కొత్త పంజా