Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 17 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి తిరిగి తన కుటుంబ గూటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే, పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మ వాడకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్, స్థానికంగా పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. సుమారు 17 సంవత్సరాల క్రితం, ఆయన వివిధ సమస్యల కారణంగా మతిస్థిమితం కోల్పోయి హఠాత్తుగా ఇంటి నుండి వెళ్లిపోయారు.
కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన ఆచూకీ కోసం అన్నిచోట్లా గాలించినా ఫలితం లేకపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో, లక్ష్మణ్ ఇక ఈ లోకంలో లేరని, మరణించి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుండి వారి కష్టసుఖాలు వారే అనుభవిస్తూ జీవిస్తున్నారు.
ఇలాంటి సమయంలో, 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, మంచిర్యాల నుంచి బంధువులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లక్ష్మణ్ మంచిర్యాలలో కనిపించాడనే సమాచారాన్ని వారు పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మంథని నర్సింగ్ బృందానికి అందించారు. వెంటనే, లక్ష్మణ్ కుమారుడు విశ్వ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలకు బయలుదేరారు. అక్కడ మంచిర్యాల పోలీసుల సహాయంతో, సీసీ ఫుటేజ్ ఆధారంగా తప్పిపోయిన లక్ష్మణ్ను గుర్తించి, క్షేమంగా పెద్దపల్లికి తీసుకువచ్చారు.
Read Also: YS Jagan: అక్రమాస్తుల కేసులో జగన్కు సీబీఐ కోర్టు బిగ్ షాక్
చిన్నతనంలో వెళ్లిపోయిన తన తండ్రి రూపురేఖలు కుమారుడు విశ్వకు గుర్తులేవు, అలాగే చెట్టంత ఎదిగిన తన కుమారుణ్ణి తండ్రి లక్ష్మణ్ కూడా వెంటనే గుర్తించలేకపోయారు. అనంతరం ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఆనందబాష్పాలు రాల్చారు.
ఈ 17 ఏళ్లు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు, తాను అసలు ఎందుకు వెళ్లానో కూడా గుర్తులేదని లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లోని ఒక షామియానా కంపెనీలో పనిచేసినట్లు చెప్పారు. తన చిన్ననాటి ప్రాంతాలైన లక్షట్ పేట, మంచిర్యాల గుర్తుకు రావడంతో శనివారం మంచిర్యాలకు వచ్చానని, అక్కడ తనను గుర్తించిన వారు కుటుంబానికి సమాచారం అందించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏనాడో మరణించాడనుకున్న వ్యక్తి సజీవంగా తిరిగి రావడంతో, లక్ష్మణ్ భార్య భాగ్య, కుమారుడు విశ్వ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.