Karimnagar News: నక్క గురించి మనం ఎన్నో కథలు విన్నాం. చాలా జానపద కథలలో, నీతి కథలలో నక్క పాత్రలు ప్రముఖంగా ఉంటాయి. కానీ, అలాంటి కథలలో వినడమే తప్ప, నేరుగా నక్కను చూసిన అనుభవం చాలా మందికి ఉండదు. అటువంటి అరుదైన నక్క ఒకటి కరీంనగర్లో కనిపించింది. దీంతో కరీంనగర్ ప్రజలు దానిని చూసేందుకు.. తమ సెల్ఫోన్లలో బంధించేందుకు ఆసక్తి చూపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రం వావిలాలపల్లిలో ఈ నక్క ప్రత్యక్షమైంది. స్థానికులు దానిని గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత రెండు రోజులుగా వావిలాలపల్లిలోని ఓ సోలార్ విద్యుత్ కార్యాలయంలో ఈ జంతువు సంచరించింది. మొదట, అది గుర్తు తెలియని జంతువుగా లేదా పిల్లిగా భావించిన స్థానికులు దానికి ఆహారం, మంచినీరు అందించారు. అయితే, అటవీ అధికారులు వచ్చి పరిశీలించగా అది నక్క అని నిర్ధారించారు.
అటవీ అధికారులు దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. నక్క అక్కడి నుంచి శివారు ప్రాంతానికి పారిపోయింది. జనావాసాల్లోకి ఈ నక్క ఎలా వచ్చిందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కొండలు, గుట్టలు కనుమరుగవుతుండటంతో అడవులలో నివాసాలు కోల్పోయి, నక్కలు జనవాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. అంతరించిపోతున్న అరుదైన నక్కను చూడటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
అందులోనూ.. నక్క కనిపించిన సోలార్ విద్యుత్ కార్యాలయ యజమాని జలేందర్ రెడ్డి చాలా ఉల్లాసంగా మాట్లాడారు. నక్క తోక తొక్కితే శుభం జరుగుతుందని.. వ్యాపారంలో రాణిస్తారని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. అలాంటి నక్క తమ కార్యాలయంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులో తమ వ్యాపారంలో బాగా రాణించగలమనే నమ్మకం తమకు కలిగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి..ఈ నక్క రాకతో కరీంనగర్ వాసులు ఉత్సాహంలో మునిగిపోయారు. చాలా మంది ప్రజలు నక్కను తమ సెల్ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి బంధించారు. తమ జీవితంలో మొదటిసారి నక్కను చూశామని, ఇది అరుదైన అనుభూతిని ఇచ్చిందని స్థానికులు చెప్పారు. జనావాసాల్లో నక్క సంచారం స్థానికులలో భయం కంటే ఆసక్తి, సంతోషాన్నే ఎక్కువ కలిగించింది. అరుదైన జీవిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో క్యూ కట్టడం విశేషం.