Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో పరిపాలనలో, పోలీస్ శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను సిట్ విచారించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (CS) సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సిట్ అధికారులు పిలిపించి విచారించారు. వారి నుంచి కీలక అంశాలపై స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వీరితో పాటు సాధారణ పరిపాలన శాఖ (GAD) మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్లను కూడా సిట్ సాక్షులుగా విచారించింది.
విచారణ ప్రధానంగా ప్రధాన నిందితుడు టి.ప్రభాకర్రావు నియామకం, అధికారాల చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్రావును ఎస్ఐబీ (SIB) చీఫ్గా, ఓఎస్డీ (OSD)గా నియమించడం వెనుక జరిగిన ప్రక్రియపై సిట్ అధికారులు మాజీ సీఎస్లను, ఇతర అధికారులను ప్రశ్నించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించిన నెంబర్ల వ్యవహారంపై జీఏడీ మాజీ కార్యదర్శి రఘునందన్ను సిట్ ఆరా తీసింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, కీలక వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రభాకర్రావు విచ్చలవిడిగా ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభాకర్రావు ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను అప్పటి ఐపీఎస్ అధికారులు ఎలాంటి తనిఖీ లేకుండా, యధావిధిగా హోం శాఖ అనుమతి కోసం పంపినట్లు సిట్ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్ల పాత్ర, వారికి తెలిసిన సమాచారం రాబట్టేందుకే సిట్ ఈ విచారణ చేపట్టింది. సాక్షులుగా వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేసులో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.
Read Also: Maruti Hybrid Cars Discounts: మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్లు, హైబ్రిడ్ కార్లపై ఏకంగా..