Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ని వెంటాడుతోందా? ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో ఛార్జిషీటు వేసేందుకు సిట్ రెడీ అయ్యిందా? ఛార్జిషీటులో కేసీఆర్ పేరు మెన్షన్ చేయనుందా? దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ముగిసినట్టేనా? ఇంకా ఏమైనా ఉందా? కొందరు రాజకీయ నేతలు, అధికారులు అరెస్టు చేయనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశం
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ అంకం ముగిసింది. ఇప్పుడు సిట్ ఏం చేయనుంది? ఈ కేసు దర్యాప్తు దాదాపు ముగింపుకు వచ్చినట్టేనా? ఇంకా ఏమైనా ఉందా? ఈ కేసులో కింది స్థాయి నుంచి ఉన్నతస్ధాయి కేసీఆర్ వరకు అందర్నీ విచారించారు సిట్ అధికారులు. రీసెంట్గా బీఆర్ఎస్ నేతలను విచారించిన సిట్, సేకరించిన సమాచారంపై అదనపు ఛార్జీషీటు దాఖలు చేయాలని ఆలోచన చేస్తోంది.
ఈసారి ఛార్జిషీటులో కేసీఆర్ పేరు మెన్షన్ చేసే అవకాశమున్నట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి. కీలక అధికారుల విచారణలో అందరూ ‘పెద్దాయన’ పేరు చెప్పారు. దీంతో ఆయన పేరు చేర్చాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీసులో సిట్ భేటీ అయ్యింది. నేతల నుంచి సేకరించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
ఛార్జిషీటులో కేసీఆర్ పేరు? రేపో మాపో పలువురు అరెస్టులు?
రేపోమాపో దాఖలు చేయనున్న ఛార్జిషీటులో కేసీఆర్ పెట్టాలని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ని ఐదుగంటలపాటు సిట్ టీమ్ విచారించింది. ఆయన నుంచి కీలక విషయాలు తెలుసుకున్న అధికారులు, టీమ్ లోని సభ్యులంతా చర్చించారు. విచారణలో కేసీఆర్ దాదాపుగా అన్నింటికి సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాకుండా అధికారులు ఏ పని చేయరు. ఈ నేపథ్యంలో ఆయన పేరు ఛార్జీషీటులో పెట్టాలని అధికారులు డిసైడ్ అయ్యారట. ఇదేకాకుండా మరిన్ని అరెస్టులు ఉంటాయని అంటున్నారు. అందులో రాజకీయ నేతలు, అధికారులు ఉండనున్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని తెలియగానే బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది.
ALSO READ: ఎగ్జామ్ బిజీలో విద్యార్థులు.. వరుసగా మూడు రోజులు సెలవు
త్వరలో మరిన్ని అరెస్టు ఉంటాయని వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఆ నేతలు ఎవరంటూ సహచరులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. అదే జరిగితే రాజకీయాల్లో తమ కెరీర్ ముగిసినట్టేనని కొందరు అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అరెస్టులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ని వణికిస్తోంది.