Extra Mile Awards: పోలీస్ ఉద్యోగం విధి నిర్వహణ మాత్రమే కాదని.. సామాజిక బాధ్యత అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్(VC Sajanar) చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రతీ పనిలో సృజనాత్మకత మానవీయత ప్రతిబింబించేలా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వర్తనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1,446మంది సిబ్బందికి బంజారాహిల్స్ ఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ‘ఎక్స్ ట్రా మైల్’ పురస్కారాలతోపాటు గుడ్ వర్క్ డన్ అవార్డులను అందచేశారు. ఇలా పురస్కారాలు ఇవ్వటం నగర పోలీస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పగించిన పనిని పూర్తి చేయటంకన్నా బాధితుల్లో ఎంత భరోసా కల్పించగలిగామన్నదే పోలీసులు సాధించే అసలైన విజయమని చెప్పారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించినపుడే ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరుగుతుందన్నారు. సిబ్బందిలోని ప్రతిభ, వినూత్న ఆలోచనలు, సేవలను గుర్తించి గౌరవించాలన్న ఉద్దేశ్యంతోనే ఎక్స్ ట్రా మైల్ పురస్కారాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇది కేవలం అవార్డు కాదని, అంకిత భావానికి దక్కే గుర్తింపు అని చెప్పారు. ఈ గుర్తింపు సిబ్బందిలో నూతనోత్తేజాన్ని నింపుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా క్షేత్రస్థాయిలో పోలీసులు కనబరిచే చిత్తశుద్ధి, ఆపదలో ఉన్నవారి పట్ల ప్రదర్శించే మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటి రాదని చెప్పారు.
Also Read: This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 17 సినిమాలు.. ఆ రెండు సినిమాలు మస్ట్ వాచ్..
హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు టీంగా పని చేసినపుడు శాంతిభద్రతలు నెలకొంటాయన్నారు. ఇకపై ప్రతీ నెలా జోన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అంద చేయనున్నట్టు చెప్పారు. పురస్కారాలు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేతతోపాటు డీసీపీలు చైతన్యకుమార్, శిల్పవల్లి, అరవింద్ బాబు, లావణ్య నాయక్ జాదవ్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mystery thriller OTT : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్