Hydra: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మా చెరువులో మురుగు నీరు చేరుతోంది. దుర్గంధభరిత వాతావరణంతో నానా ఇబ్బందులు పడుతున్నాం, గుర్రపు డెక్క పెరిగి దోమలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి..పగలూ, రాత్రి అనే తేడా లేకుండా కిటికీలు, తలుపులు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, మా చెరువుల్లో మురుగు నీరు కలవకుండా చూడాలని, మా చెరువులను కూడా అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని హైడ్రా (Hydra) నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 36 మంది నగరవాసులు కాల్ చేసి కోరారు. ఫోన్ – ఇన్ కార్యక్రమంలో (Hydra) హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలు విన్నపాలను స్వీకరించారు. ప్రతి హైడ్రా (Hydra) ప్రజావాణికి అదనంగా నాడు ఫోన్ – ఇన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమని నగరవాసులు హైడ్రాను అభినందించారు.
హైడ్రా కార్యాలయం వరకు రాలేనివారు, సమస్యలను ఫోనులో చెప్పుకునే అవకాశం కల్పించటం పట్ల పలువురు నగరవాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ జరిగిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో నేరుగా కమిషనర్ ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను విని, పరిష్కారానికి సంబంధిత అధికారి వివరాలను అందజేశారు. వారం తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా తనకు ఫోను చేయాలని ఫిర్యాదుదారులకు హైడ్రా కమిషనర్ సూచిచారు.
Also Read: Hydra: హైడ్రా అదుర్స్ .. 1365 గజాల ప్రభుత్వ భూమి భూమిని కాపాడిన హైడ్రా!
ప్రతి 040-29565750, 040-29565759 ఈ నెంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియజేయాలని కమిషనర్ రంగనాధ్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. అక్కడ కూడా చెరువులు ఆక్రమణలకు గురౌతున్నాయని, వాటిని కాపాడాలని పలువురు కోరినట్లు తెలిపారు. ఓఆర్ ఆర్ వరకే హైడ్రా పరిధి అంటూ, వారికి కమిషనర్ సర్ది చెప్పారు. మొదటి విడత 6 చెరువుల అభివృద్ది చేపట్టగా, త్వరలోనే మరో 14 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని నగరవాసులకు వివరించారు. ఇలా దశలవారీ చెరువులను అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ వారికి తెలిపారు.
చెరువులు సహజ లక్షణాలను కోల్పోయాయని, వాటిని పునరుద్ధరించాలని ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులందాయని తెలిపారు. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఫుట్పాత్లు ఆక్రమణకు గురై, నడక దారి లేకుండా చేస్తున్నారంటూ నగరం నలుమూలల నుంచి హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయి. దుండిగల్ మున్సిపాలిటీలోని గాగిలాపూర్లో రహదారులను ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రగతి నగర్ వద్ద ఓ పార్కులో ఆలయం కట్టడానికి ప్రయత్నిస్తున్నారని, నాగిరెడ్డి కుంటలోకి మురుగు నీరు చేరకుండా డైవర్ట్ కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయని, మాధాపూర్లోని సున్నం చెరువు వద్ద పేరుకు వంద అడుగుల రహదారి ఉన్నా, మొత్తం నీటి ట్యాంకర్లతో ఆ రోడ్డు అంతా రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫోనులో ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులందినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
బడా నిర్మాణ సంస్థలకు చెందిన వారు వరద కాలువలను దారి మళ్లించటమే గాక, కబ్జాలకు పాల్పడుతున్నారని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులందాయి. అత్తాపూర్ లో 33 గుంటల ప్రభుత్వ భూమితో పాటు 900 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, అక్కడ నిర్మాణాలు రాకముందే అడ్డుకోవాలని సూచించారు. ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కోరారు. ఇలా శనివారం హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమంలో 36 మందితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడి వారి సమస్యలను తెల్సుకున్నారు.
Also Read: HYDRAA: హైడ్రా కమిషనర్తో ఇక నేరుగా ‘ఫోన్-ఇన్’.. శనివారం ఫిర్యాదు చేస్తే చాలు, యాక్షన్ మొదలు!