2024 Lok Sabha Polling Details in Telangana: రాష్ట్రంలో సోమవారం పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. ఓటర్లు ఉత్సాహం చూపడంతో 2019 లోక్ సభ ఎన్నికలకు మించి ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. తుది గణాంకాలకు సంబంధించి నేడు ఈసీ వెల్లడించే అవకాశముంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరిగింది.
సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, పలు ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే, సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అయితే, కొన్ని చోట్లా ఈవీఎంలు మొరాయించడం, ఇతర సమస్యల కారణంగా పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.
ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 11 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే, అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. అత్యల్పంగా హైదరాబాద్ లో 46.08 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈసీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Also Read: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. పలు ప్రాంతాల్లో స్వల్ప సంఘటనలు తప్ప పోలింగ్ సజావుగా సాగిందన్నారు. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందనేదానిపై నేడు పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, ఎంపీ అసదుద్దీన్ తోపాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.