Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో హనుమకొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు.
శాయంపేటలో ఇళ్ల పంపిణీ.. లబ్ధిదారులకు భరోసా
హనుమకొండ జిల్లా శాయంపేటలో 608 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. అలాగే కాళోజీ కళాక్షేత్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు అనేవి పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకలని మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి విమర్శలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2.5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరో 2 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తామని మంత్రి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతూ.. ‘మేము కట్టిన వాటినే ఇప్పుడు కాంగ్రెస్ పంపిణీ చేస్తోందని విమర్శించేవాళ్లు, మరి గత పదేళ్లలో ఆ ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు పేదలకు పంచలేదు?’ అని ప్రశ్నించారు. దొరల పాలన తెల్లకాగితాలకే పరిమితమైందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కేవలం తమ సొంత నియోజకవర్గాలకే ఇళ్లను పరిమితం చేశారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3 వేల ఇళ్లను ఇస్తోందని స్పష్టం చేశారు.
వరంగల్ అభివృద్ధి, అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్ తరహాలోనే గ్రేటర్ వరంగల్ను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు, త్వరలోనే మామునూరు ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. వరంగల్ పశ్చిమలో మరో 20 వేల మంది ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
పైసలు ఆశించం.. లంచాలు ఇవ్వకండి
గత కాంగ్రెస్ హయాంలో కేటాయించిన స్థలాల్లోనే బీఆర్ఎస్ సర్కార్ ఇళ్లను నిర్మించిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గుర్తు చేశారు. మాడవీధులు, పోతన నగర్ బాధితులకు ఈ విడతలో ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. నగరంలో ఇళ్లు లేని పేదలు చాలామంది ఉన్నారని, మూడో ఫేజ్ కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి మరిన్ని ఇళ్లను కడతామని, అర్హులైన వారందరికీ వెనకా ముందైనా ఇళ్లు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇళ్ల కేటాయింపులో తాము రూపాయి కూడా ఆశించబోమని, ఎవరైనా లంచాలు అడిగితే నమ్మవద్దని లబ్ధిదారులకు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకుంటే అవి చెల్లవని, కొందరు తమపై కావాలనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు. గత పాలకుల విద్వాంసం, కబ్జాల వల్ల వరంగల్ జిల్లా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్ను కడిగిపారేసిన రాచమల్లు!