కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని.. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించాలని ఏఐసీసీ (AICC) ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నిరసనలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ఉపాధి హామీ. గ్రామీణ ప్రాంత పేదలకు, కూలీలకు ఈ పథకం ఒక భరోసాగా నిలుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని, నిధుల కోత విధిస్తూ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన కోరారు.
ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహాల వద్ద లేదా గాంధీ చిత్రపటాలను చేతబూని నిరసనలు తెలియజేయాలని ఆయన సూచించారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, పనికి ఇచ్చే గౌరవం. ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలి’ అని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Phone Tapping case: ముగిసిన ఆరా మస్తాన్ విచారణ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు