Telangana: పంద్రాగస్టు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. 26 జనవరి. దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రెండూ జెండా పండుగలే. రెండూ జాతీయ వేడుకలే. దేశమంటే ఆ రెండు రోజులే. అలాంటి గణతంత్ర దినోత్సవంపై మునుపెన్నడూ లేనంత రచ్చ. సీఎం వర్సెస్ గవర్నర్.. కోల్డ్ వార్ లో జాతీయ పండగే మసకబారుతోంది.
రిపబ్లిక్ డే అంటే తెలంగాణ వారందరికీ గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండే. ఘనంగా జరుగుతుంది మన గణతంత్ర దినోత్సవం. పోలీస్ బలగాల పరేడ్ పదఘట్టనలతో దేశభక్తి పెంపొందుతుంది. టీవీల్లో ఆ విజువల్స్ చూసి.. ప్రజల్లో జాతీయ భావం ఉప్పొంగుతుంది. వివిధ శాఖల శకటాలు, పలు విభాగాల ప్రదర్శనలు.. రాష్ట్ర అభివృద్ధిని కళ్లకు కడతాయి.
అలాంటి రిపబ్లిక్ డే పరేడ్.. ఈసారి రాజకీయ క్రీడలో పావుగా మారింది. పరేడ్ గ్రౌండ్ లో పరేడే లేకుండా చేసింది సర్కార్. గవర్నర్ తమిళిసై గౌరవాన్ని అడ్డుకోవడానికే ఈ ఎత్తుగడ అనే విమర్శ ఉంది. ప్రభుత్వం చెప్పిన కుంటి సాకు మరీ సిల్లీగా ఉంది. కొవిడ్ కారణంగా ఈసారి ఘనంగా గణతంత్ర వేడుకలు జరపలేమని చెప్పడం.. రాజ్ భవన్ లోనే గవర్నర్ వేడుకలు చేసుకోవాలని లేఖ రాయడం.. నవ్విపోదురు గాక నాకేంటి? అన్నట్టు సర్కారు తీరు ఉందంటున్నారు.
హైకోర్టు తీర్పుతో రిపబ్లిక్ డే వేడుకల్లో కాస్త ఊరట కలిగింది. పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే జరపాల్సిందేనంటూ హైకోర్టు తేల్చి చెప్పడంతో.. సర్కారు అందుకు సరేననక తప్పలేదు. అందులోనూ మళ్లీ తిరకాసు పెట్టేసింది.
ఈసారి రాజ్ భవన్ లోనే గవర్నర్ జెండా ఎగరేస్తారని.. అక్కడే పోలీస్ బలగాల పరేడ్ కూడా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో మరోసారి అంతా షాక్. అదేంటి? రాజ్ భవన్ లో పోలీస్ పరేడా? అక్కడ అంత ప్లేస్ అయినా ఉందా? గవర్నర్ ను మరీ ఇంతగా కార్నర్ చేయాలా? అనే చర్చ నడుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేంటి.. తనతోనే పెట్టుకుంటారా? అనేది సీఎం కేసీఆర్ లెక్కలా ఉందంటున్నారు.
ఏమో. వారికి వారికి మధ్య ఏ ఆధిపత్యపోరు ఉందోగానీ.. మధ్యలో జాతీయ వేడుక, జెండా పండుగతో రాజకీయం చేయడం మాత్రం అస్సలు బాగోలేదంటున్నారు. వింటేగా.. కేసీఆర్ పట్టించుకుంటేగా!?.