నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ నేతలు చెలగాటమాడుతున్నారంటూ నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ వేదికగా ఆయన కేటీఆర్, హరీష్ రావుల తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి అని ఆయన ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో అల్లాడుతుంటే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ చేస్తున్న నికృష్ట ప్రకటనలు నల్లగొండ జిల్లాలో ఉన్న 45 లక్షల మంది ప్రజలను చంపేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ వేస్తున్న ప్రతి అడుగుకు హరీష్ రావు మడుగులొత్తుతూ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న నరహంతకులు, మోసగాళ్లు నల్లగొండ జిల్లాను శాశ్వతంగా అంధకారంలోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ నదిలోని విషతుల్యమైన నీటి వల్ల తాము ఏ పాపం చేశామని జీవితాంతం మగ్గిపోవాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలు రోగాల బారిన పడి చనిపోతుంటే మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
నల్లగొండ జిల్లా పేరు చెప్పుకుని రాష్ట్రమంతా ఓట్లు అడగడానికి కేటీఆర్.. హరీష్ రావులకు సిగ్గులేదా అని కైలాష్ నేత ప్రశ్నించారు. మూసీ మురుగు నీటితో జిల్లా ప్రజలు విష బీజాల మధ్య చిక్కుకొని విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నరకం నుండి జిల్లాకు విముక్తి కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఎటువంటి రాజకీయ ప్రయోజనం.. లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజా సంక్షేమం కోసమే సీఎం మూసీ ప్రక్షాళన చేపడుతున్నారని స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మూసీ శుద్ధి ద్వారానే జిల్లా భవిష్యత్తు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: DWCRA Women Clash: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా మహిళలు.. వీడియో వైరల్!