హైదరాబాద్ నగరంలోని క్వాక్ పబ్ వేదికగా వెలుగు చూసిన డ్రగ్స్ కలకలంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిన్న రాత్రి పబ్ పైన దాడులు నిర్వహించిన సమయంలో పోలీసులు ఎనిమిది మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరికి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నేడు పకడ్బందీగా వైద్య పరీక్షలతో పాటు శాస్త్రీయ డ్రగ్ టెస్టులు నిర్వహించడంతో ఏడుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో అత్యధికులు సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం.
ఈ కేసులో రిత్విక్ అనే యువకుడి నివేదికలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతడి రక్త నమూనాలను పరీక్షించగా కల్లుతో పాటు బెంజోడియాజెపైన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. రిత్విక్ కల్లు సేవించడమే కాకుండా డిప్రెషన్ కోసం వాడుతున్న మందులు తీసుకోవడం వల్ల ఈ రకమైన రిపోర్ట్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రిత్విక్ పరిస్థితి భిన్నంగా ఉండటంతో అతడిని మినహాయించి మిగిలిన ఏడుగురికి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దర్యాప్తులో తేలిన మరో కీలక విషయం ఏమిటంటే నిన్న డ్రై డే అయినప్పటికీ పబ్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించింది. రాత్రి 10 గంటల తర్వాత నుంచి పబ్ లో యథేచ్ఛగా లిక్కర్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. పట్టుబడిన ఏడుగురిలో ఆరుగురు హైదరాబాద్ వాసులే కాగా ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. మహారాష్ట్రలో మొబైల్ షాప్ నడుపుతున్న రితీష్ అనే వ్యక్తికి కూడా డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీకి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆకెళ్ల హరిత్ సారంగ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
నిన్న పబ్ లో నిర్వహించిన ఈవెంట్ కు దాదాపు 1500 మందికి పైగా హాజరయ్యారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు డ్రగ్స్ పబ్ లో తీసుకోలేదని వెల్లడైంది. వీరంతా బయట వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాలు సేవించి పబ్ కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. పట్టుబడిన యువకుల్లో ఎవరికీ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం విలాసాల కోసం డ్రగ్స్ వైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
ALSO READ: రైల్వేకోడూరులో నాకు రక్షణ లేదు.. ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే శ్రీధర్ పై హర్షవీణ సంచలన ఫిర్యాదు