Agricultural University: తెలంగాణలో బీఎస్సీ అగ్రికల్చర్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఫోకస్ చేశారు. దీంతో ప్రమేయమున్న ఓ ఉన్నతాధికారి సహా ముగ్గురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. మరో 35 మంది ప్రవేశాలను రద్దు చేశారు. రేపో మాపో సైబర్ క్రైమ్ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీక్
వరంగల్ కేంద్రంగా బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ పేపర్ లీకైన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక ఓ ఉన్నతాధికారి, ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మేరకు గురువారం రాత్రి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు 35 మంది ఇన్ సర్వీసు అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందినట్లు గుర్తించారు. వారంతా వ్యవసాయ అధికారులుగా ఉండి ఇన్సర్వీసు కోటాలో మూడేళ్ల కిందట బీఎస్సీలో ప్రవేశాలు పొందినట్టు తేలింది. వారి ప్రవేశాలను రద్దు చేసింది యూనివర్సిటీ. తిరిగి వారిని వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఇన్సర్వీసు కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా వారిని బ్లాక్లిస్టులో పెట్టారు.
అధికారులు సస్పెండ్, రంగంలోకి సైబర్ క్రైమ్ అధికారులు?
జగిత్యాల వ్యవసాయ కళాశాలను పోయినవారం యూనివర్సిటీ వీసీ జానయ్య సందర్శించారు. ఆ సమయంలో సెమిస్టర్ పరీక్షల మార్కుల షీట్లను స్వయంగా ఆయన పరిశీలించారు. ఇన్సర్వీసు విద్యార్థులకు పాథాలజీ సబ్జెక్టులో 90 శాతానికి పైగా మార్కులు రావడంతో ఆయన షాకయ్యారు.
నార్మల్గా పాథాలజీలో అత్యంత ప్రతిభావంతులకు 60 శాతం మించి ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భం లేదు. అలాంటిది 90 శాతానికి పైగా మార్కులు రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనుమానం వచ్చి పరీక్షలు జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీలను ఆయన స్వయంగా పరిశీలించారు.
అందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్ సర్వీస్ అభ్యర్థి కేవలం 10 నిమిషాల్లో ఎగ్జామ్ రాసి ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. చివరకు ఆ విద్యార్థిని పిలిచి ప్రశ్నించడంతో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ నుంచి వాట్సప్లో ప్రశ్నాపత్రం వచ్చినట్టు తేలింది.
ALSO READ: సంక్రాంతి ప్రయాణికుల ఊరట.. ప్రైవేటు ట్రావెల్ బస్సులపై ఆర్టీఓ అధికారుల దాడులు
ఏఐ పెన్నులో జవాబులు నమోదు చేసుకుని పరీక్ష రాసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై ముగ్గురు అధికారులతో కమిటీ వేసి విచారణ ఆదేశించారు వీసీ. దీంతో మొత్తం వ్యవహారమంతా బయటపడింది. వరంగల్ వ్యవసాయ కళాశాల అధికారి, ఉద్యోగి కలిసి ఆరు ఎగ్జామ్ పత్రాలను వాట్సప్ గ్రూపుల ద్వారా ఇన్సర్వీసు అభ్యర్థులకు పంపినట్లు తేలింది.
ఒక్కో అభ్యర్థి నుంచి 10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేసినట్టు అంతర్గత సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న 35 మంది ఇన్సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరినట్టు గుర్తించారు. వారంతా ఏఐ ఆధారిత పెన్ను సహాయంతో పరీక్షలు రాసినట్లు తేలింది. పేపర్ లీక్ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయించారు వీసీ జానయ్య.