Case on Private Buses: సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు.. పట్టన నగరాలు మొత్తం ఖాళీ అయిపోతాయి.. నెల రోజుల ముందు నుంచే పల్లెలోకి వెళ్లడానికి ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. దీంతో ఇదే మంచి ఛాన్స్ అనుకుని ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తారు. దీని గమనించిన అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల పై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
రాజేంద్రనగర్లో RTO అధికారుల తనిఖీలు
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులపై ఆర్టీవో (RTO) బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పలువురు ట్రావెల్స్ నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు..
అయితే ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుండి పొరుగు రాష్ట్రాలైన కేరళ, బెంగళూరు, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న బస్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా పర్మిట్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న టికెట్ ధరలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో పలువురు ట్రావెల్స్ నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
5 బస్సులపై కేసులు నమోదు.. కొనసాగుతున్న అధికారుల సోదాలు
తాజా సమాచారం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన 5 ప్రైవేట్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే బస్సులను సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Also Read: తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు అగ్నికి ఆహుతి
అంతేకాకుండా ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ట్రావెల్స్ నిర్వాహకులు అధిక ధరలు డిమాండ్ చేస్తే వెంటనే రవాణా శాఖ ఫిర్యాదు కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠినమైన జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగ సమయంలో ప్రజల ప్రయాణం సురక్షితంగా, భారీ ఖర్చు లేకుండా సాగాలన్నదే తమ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా
సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
రాజేంద్రనగర్ లో RTO అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నుంచి కేరళ, బెంగళూరు, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు ఏపీకి వెళుతున్న బస్సులను తనిఖీలు చేస్తున్న… pic.twitter.com/SqmUAahie5
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026