అందెశ్రీ నుంచి ఈ తరం గాయకులు చాలా నేర్చుకోవాలని నల్గొండ గద్దర్, ప్రజా గాయకుడు నర్సన్న అన్నారు. అందెశ్రీ ఇంకొన్నాళ్లు మన మధ్య ఉంటారనుకున్నాం.. కానీ ఆయన మరణంతో అభిమానులు, తెలంగాణ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారన్నారు. అందెశ్రీ కొత్త గాయకులను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారని నర్సన్న చెప్పారు.
క్యాబినెట్ భేటీలో రెవెన్యూ శాఖకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. రెవెన్యూ శాఖ కింద స్థాయిలో కరప్షన్ జరుగుతోందని.. మంత్రులు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రెవెన్యూ అధికారులకి డబ్బులివ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. రెగ్యులర్గా మానిటరింగ్ లేకపోతే వివాదాలు పెరుగుతాయని సీఎం చెప్పారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నిజాన్ని బయటపెట్టిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇది కల్తీ కాదని.. హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అంటూ ట్వీట్ చేశారు. మన విశ్వాసాన్ని అపవిత్రం చేయడమే అన్నారు.
ఏలూరు మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై ఎలుకల దాడి చేసిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ సావిత్రి స్పందించారు. మూడేళ్ళలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో ర్యాట్ మ్యాప్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందింస్తున్నామన్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పాత్లవత్ రాము నాయక్, కల్లూరు నిఖిల్ కుమార్ రెడ్డి, పాలకొండ మనోజ్ కుమార్ అనే వ్యక్తులు.. మార్టిగేజ్ రుణాలు ఇప్పించి తమ భూములను వేరే వ్యక్తికి రిజిష్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ సమాజానికి అందెశ్రీ అండగా నిలిచారని తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్ వెన్నెల అన్నారు. అందెశ్రీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజలను కదిలించాయని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ సామాజిక న్యాయం కావాలన్నదే అందెశ్రీ ధ్యేయమని వెన్నెల అన్నారు.
దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలను నివారించడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్లో శ్రీకాకుళం తరహా ఘటనలు జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
తిరుమల పరకామణి కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేపడుతున్నారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఐదు బృందాలుగా ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా మద్యాన్ని డబ్బులు పంపిణీ చేస్తోందన్నారు. ఓటర్లకు చీరలు, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతున్నారని.. ఇంత చేస్తుంటే స్థానిక అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల ప్రధాన ఆధారాలు అందించినట్లు హరీష్ రావు చెప్పారు.
తిరుమలలోని శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రశ్నించిన భక్తులను సిబ్బంది బెదిరించినట్లు తెలుస్తోంది. టీటీడీ విజిలెన్స్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఉపాధ్యాయుడు కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిని వినికిడి కోల్పోయాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామినారాయణ గురుకులంలో చోటుచేసుకుంది. పాఠశాల యాజమాన్యమే తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందిన 65 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్ ఉంచకూడదని.. అలాగే భూ సమస్యలు, పెన్షన్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆదివాసి సంఘాలు అదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జైనథ్ మండలం బెల్లూరి గ్రామ ఆదివాసి యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, కాటిపల్లి విజయ్రెడ్డి అనే వ్యక్తి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించాయి. కట్నం కోసం వేధించిన భర్తపై చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.
ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు ఎగ్జిబిషన్ నిధులను మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిందన్నారు. ప్రజాధనం కాపాడతామని ఆయన తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తుమ్మలగుంటపాలెంలో కుటుంబ కలహాలతో కత్తులతో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామానికి చేందిన రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్లపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన ముగ్గురు భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేరళలోని తమ్మనం ప్రాంతంలో 50 ఏళ్ల నాటి KWA ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఉద్ధృతంగా జనావాసాలపైకి రావడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు తాత్కాలికంగా నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యాసంస్థల్లో ఇకపై వందేమాతరం గేయాలాపనను తప్పనిసరని చేశారు. గోరఖ్పుర్లో ‘ఏక్తా యాత్ర’లో ఆయన ఈ ప్రకటన చేశారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే గౌరవం, దేశభక్తిని పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుందన్నారు.
రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న RT76 చిత్రానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి.. అనే టైటిల్ను చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సందర్భంగా తాజాగా గ్లింప్స్ను విడుదల చేశారు. ప్రస్తుతం రవితేజ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ సేఫ్టీ ఎమెడ్మెంట్ బిల్ 2024 ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, యూట్యూబ్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోయింది. కొద్దిరోజులుగా చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను వదులుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలొస్తున్నాయి. జడేజాను వదులుకుని 2026 ఐపీఎల్ కోసం అతడి స్థానంలో సంజు శాంసన్ను తీసుకునేందుకు CSK ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.