Revanth Reddy News Today(Political news in telangana): తెలంగాణలో బీజేపీ మూడవ స్థానానికే పరిమితం అవుతుందని.. ఓ వార్తా పత్రిక కథనాన్ని ఊటంకిస్తూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్వయంగా బీజేపీ ముఖ్య నేతనే తెలంగాణలో బీజేపీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందని ఒప్పుకున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు కూడా లేరన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకోవడమే బీజేపీ ప్లాన్ అన్నారు రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలని, వారిని ఎవరూ విడదీయలేరని పీసీసీ చీఫ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ విడిపోయినట్టు నాటకం ఆడుతున్నాయని.. ఇదంతా కాంగ్రెస్ను ఓడించే కుట్ర అన్నారు. కేసీఆర్ను ఓడించాలని కొందరు క్షణికావేశంలో బీజేపీలో చేరారని.. వారంతా పునరాలోచించుకోవాలని.. కాంగ్రెస్లో చేరాలని పిలుపు ఇచ్చారు. బీజేపీని నడిపించే సత్తా బండి సంజయ్కు లేదన్నారు రేవంత్రెడ్డి.
అటు, ఓఆర్ఆర్ లీజ్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్రోడ్డును 7వేల కోట్లకు తెగనమ్మారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యి రెట్లు పెద్దదని విమర్శించారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్పై కేంద్రం ఏం చేస్తోందని.. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. 30 రోజుల్లో 25 శాతం చెల్లించాలని ఒప్పందంలో ఉందని.. ఇప్పటికీ ఐఆర్బీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. తన ఆరోపణలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలన్నారు రేవంత్రెడ్డి.
మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి HMDA లీగల్ నోటీస్ పంపింది. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ఆరోపణలు చేసినందుకు లీగల్ నోటీస్ ఇచ్చింది. పారదర్శకంగానే ORR టెండర్లు నిర్వహించామని హెచ్ఎండీఏ తెలిపింది. టెండర్ నిబంధనల ప్రకారం IRB ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయనక్కర లేదంది. ఇప్పటి వరకు IRBతో ఎలాంటి కన్సెషన్ అగ్రిమెంట్ జరగలేదని HMDA నోటీసుల్లో ప్రస్తావించింది.
HMDA లీగల్ నోటీసులను స్వాగతించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తనకు నోటీసులు ఇవ్వడంపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. 135 పేజీల టెండర్ డాక్యుమెంట్ను బయటపెట్టారు. టెండర్ కేటాయించి 30 రోజులైనా ఇంతవరకూ IRB ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు.