CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలోని పాల్గొని మాట్లాడారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చి, గుండెపోటుగా చిత్రీకరించారని చంద్రబాబు అన్నారు. ఆ నిందను తనపై నెడుతూ ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ గతంలో తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తిరస్కరించారని అన్నారు. ఇప్పటికీ పనికిమాలిన పనులు చేస్తున్న విపక్షాలకు ప్రజలే ఎప్పటికప్పుడు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరుతో దగా చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తుంటే చూసి ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన వారు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే వారికి మనుగడ ఉండదని వైసీపీని ఉద్దేశిస్తూ హెచ్చరించారు.
హైదరాబాద్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై కూడా చంద్రబాబు ఈ సందర్భంగా స్పందించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే తెలంగాణకు పారిపోయి అక్కడ ఫోర్జరీ సంతకాలతో రూ.1500 కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఆటలు సాగవనే భయంతోనే పక్క రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేశారన్నారు. ఇంత పెద్ద తప్పు చేసినా సదరు నేతను ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
Also Read: ఎగ్జామ్ లేకుండానే సీట్లు ఇవ్వాలి.. లేదంటే ఉద్యమిస్తాం.. కవిత సంచలన డిమాండ్
మరోవైపు ఏపీకి పెట్టుబడులు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు చెప్పారు. ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాసు పుస్తకాలను అందించడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు పంచ్ ల వర్షం కురిపించారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతుల బాధలు తెలయవని వ్యాఖ్యానించారు. గంజాయ్ బ్యాచ్ ను ఓదార్చే వారికి సాగు గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. కోడికత్తి డ్రామాలాడే వారికి వరి కోతలు తెలియవంటూ ఎద్దేవా చేశారు. అటు తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వారిని ఈ జన్మలోనే ఆ దేవుడు శిక్షిస్తాడని హెచ్చరించారు.
Also Read: ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!