Family Benefit: స్వేచ్చ బ్యూరో: కుటుంబానికి ప్రధాన ఆధారమైన ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, ప్రచార లేమి కారణంగా మూలకు చేరిన ఈ సంక్షేమ పథకానికి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసి అర్హులైన పేదలకు అండగా నిలుస్తోంది.
ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకం గత ప్రభుత్వ కాలంలో నీరుగారిపోయింది. ఎన్నో కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నా సాయం అందక ఇబ్బందులు పడ్డాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. బకాయిలను క్లియర్ చేస్తూ, నిధులు విడుదల చేసి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతోంది.
ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎన్ఎఫ్బీఎస్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఎన్ఎఫ్బీఎస్ పథకం చాలామందికి దూరమైంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి మళ్లీ మోక్షం లభించింది. మృతిచెందిన కుటుంబ సభ్యులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే తక్షణ సాయం కింద రూ.20వేలు అందజేస్తుంది. ఈ నిధులు అందజేత పేదల ఇళ్లకు భరోసా కల్పిస్తుంది.
Also Read: ఫేస్బుక్లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై దృష్టిసారించింది. ప్రతీ కేంద్ర పథకం రాష్ట్రంలోని అర్హులకు అందజేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ను సైతం వినియోగించుకుంటుంది. ఇప్పటివరకు 19,685 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. గతేడాది (2024-25) 15,420 మందికి రూ.30.84 కోట్లు, ఈ ఏడాది (2025-26) జూలై మూడోవారం వరకు 4,265 మందికి రూ.8.53 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం కింద 39.37కోట్లను పేదల కుటుంబాలకు అందజేశారు.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ఎస్ఏపీ)లో భాగమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. కుటుంబ పోషకుడు(పెద్ద) మృతి చెందిన సందర్భంలో ఆ కుటుంబానికి ఒకేసారి ఏక మొత్తంగా 20వేలు ఆర్థికసాయం అందిస్తున్నారు. పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో సామాజిక భద్రత కల్పించి వారి జీవనోపాధిని నిలబెట్టడం కోసమే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి మృతి చెందిన వ్యక్తి కుటుంబం దారిద్ర్య రేఖకు(బీపీఎల్) దిగువన ఉండి, ఆహార భద్రతాకార్డు, రేషన్ కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులని అధికారులుతెలిపారు.
మృతి చెందిన కుటుంబ పెద్ద 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సహజమరణం, ప్రమాద వశాత్తు మరణించినా సాయం అందించబడుతుంది. బాధిత కుటుంబాలు ఎక్కడికీ తిరగాల్సిన పని లేకుండా, తమకు సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారా సులభంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు దారులు తెలుపు రేషన్ కార్డు లేదా ఆహార భద్రతాకార్డు, కుటుంబ పోషకుడి మరణ ధృవీకరణ పత్రం, మృతుడి ఆదార్ కార్డు, మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం, దరఖాస్తు దారుడి ఆధార్ కార్డు, పాస్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, దరఖాస్తు దారుడి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ నకలుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఆర్థికసాయం లబ్దిదారుల బ్యాంకు ఖాతాకు డీబీటీ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా జమచేస్తారు. సందేహాలు ఉంటే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓ, సెర్ప్ కార్యాలయంలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: Medchal: మేడ్చల్ బస్టాండ్కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!