RS Praveen Kumar: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల (BLAs) అవగాహన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ఆందోళన
దేశంలో ఇప్పటివరకు ఐదు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడితే, అందులో నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 20 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. 2002 నాటి డాటాను ప్రామాణికంగా తీసుకుని చేస్తున్న ఈ మ్యాపింగ్ ప్రక్రియపై బిఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగిస్తే వెంటనే రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!
కాంగ్రెస్, బీజేపీల అంతర్గత ఒప్పందం
2028 ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైతే సీఎం రేవంత్ రెడ్డి కాపాడడమే దీనికి నిదర్శనమన్నారు. గతంలో ఏపీలో ‘సేవా మిత్ర’ యాప్ ద్వారా ఓట్లు తొలగించినట్లే, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ‘చంద్ర మిత్ర’ లాంటి యాప్తో బిఆర్ఎస్ ఓట్లను గల్లంతు చేసే ప్రమాదం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 20 వేల దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాదర్గుల్, కొత్వాల్గూడ మైనింగ్, ఫ్యూచర్ సిటీ భూముల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. చివరికి గురుకుల విద్యార్థుల యూనిఫాంలు, దుప్పట్లు, ప్లేట్ల పంపిణీలో జీవో నెం.17 పేరుతో రూ. 2 నుంచి 3 వేల కోట్ల టెండర్ల స్కామ్కు తెరలేపారన్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా పుస్తకాలు, యూనిఫాంలు అందించలేదని, ఏటా 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి నిరుద్యోగులు, రైతులు, మహిళలు మోసపోయారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలన–బిఎల్ఏల బాధ్యత
పదేళ్లలో కేసీఆర్ బంజరు తెలంగాణను బంగారు తెలంగాణగా మారిస్తే, కాంగ్రెస్ పాలన కన్నీళ్లు మిగిల్చిందని, రైతుబంధు, దళితబంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు. తెలంగాణను కాపాడుకునేందుకు బిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చి కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా బిఎల్ఏలు పనిచేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు (ఫారం 6), తప్పుడు ఓట్ల తొలగింపు (ఫారం 7), సవరణల (ఫారం 8) ప్రక్రియను పూర్తి చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.