Raithu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి ఈ మొత్తాన్ని ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా.. పంట పెట్టుబడుల భారం తగ్గించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, సాగునీటి ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిధులు రైతులకు భారీ ఊరట కలిగించనున్నాయి.
ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతుల భూములు, సాగు చేసిన పంటల వివరాలను సేకరిస్తోంది. ఏ భూమిలో పంట సాగు జరుగుతోంది? ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలను స్పష్టంగా గుర్తించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం జనవరి రెండో వారం నాటికి.. శాటిలైట్ ఆధారిత డేటా సేకరణ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత అర్హులైన రైతుల జాబితాను ఖరారు చేసి, రైతు భరోసా నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయనుంది.
రైతు భరోసా పథకంలో ఈసారి కొన్ని కీలక మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు సాగు జరగకపోయినా భూమి ఉన్న వారందరికి రైతు భరోసా అందుతున్న పరిస్థితిపై విమర్శలు రావడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
అయితే, వర్షాభావం, నీటి కొరత వంటి కారణాలతో సాగు చేయలేని రైతుల పరిస్థితిని కూడా.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నదానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.
వ్యవసాయశాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సాగు లెక్కలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో పంటల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి, వానాకాలం సీజన్లలో సాగు జరిగిన విస్తీర్ణం, రైతు భరోసా చెల్లింపుల వివరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంత మంది రైతులు అర్హులు? ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి? ఎకరానికి రూ.6 వేల చొప్పున ఈ సీజన్కు మొత్తం ఎంత నిధులు అవసరం? అన్న అంశాలపై అధికారులు సమగ్రంగా కసరత్తు చేస్తున్నారు.
రైతు భరోసా నిధులపై స్పష్టత రాగానే అన్ని వివరాలను ఆర్థిక శాఖకు సమర్పించేందుకు.. వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడిన వెంటనే నిధుల విడుదల ప్రక్రియ వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు
రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలు, మినహాయింపులు, శాటిలైట్ డేటా ఆధారంగా తీసుకునే నిర్ణయాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశముండటంతో సభలో చర్చకు దారి తీసే సూచనలు ఉన్నాయి.