తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగియగా.. డిసెంబర్ 14న జరగబోయే రెండో విడత ఎన్నికల కోసం గ్రామాల్లో పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మాదరి శ్రీనివాస్ వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన కేవలం హామీలు ఇవ్వడం మాత్రమే కాకుండా, ఏకంగా 14 అంశాలతో కూడిన ‘మీ మాదరి శ్రీనివాస్ గ్రామ అభివృద్ధి మేనిఫెస్టో’ను ముద్రించి మరీ పంచుతున్నారు. ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు మాదాపూర్ గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
శ్రీనివాస్ ప్రకటించిన మేనిఫెస్టోలో అత్యంత ముఖ్యమైన హామీలు గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. ముఖ్యంగా.. ఏడాదిలోపు ఇంటి పన్ను, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు మొత్తం గ్రామంలో ఒక్క రూపాయి కూడా కట్టకుండా చూస్తానని ఆయన ప్రధానంగా హామీ ఇచ్చారు. అలాగే, గ్రామంలో జన్మించిన ప్రతి ఆడబిడ్డకు 21 రోజుల్లో రూ.5116 డిపాజిట్ చేస్తానని హామీ ఇవ్వడం ప్రజల్లో ఈ ప్రచారం వైరల్ గా మారింది. దీంతో పాటు.. చనిపోయిన కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఇస్తానని ప్రకటించారు
ఇతర కీలక హామీలలో.. గ్రామంలోని పేద బాలికలందరికీ చదువుల కోసం ఆర్థిక సాయం, పాత హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ప్రతి నెలా పేద పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, ఏడాదిలోపు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్, చత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. యువత కోసం నిరుద్యోగ భృతి మరియు ప్రత్యేక తరగతులు, రైతులకు కమ్యూనిటీ లీడర్షిప్ ద్వారా సాగుపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అలాగే, ప్రతి పుట్టిన రోజుకి ఒక మొక్క నాటే కార్యక్రమం, ప్రధాన రహదారిపై దేవాలయాలు, పాఠశాలలు, మసీదుల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు వంటి పర్యావరణ, భద్రతా అంశాలపైనా దృష్టి సారించారు.
ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా, మేనిఫెస్టో రూపంలో నిర్దిష్ట హామీలను ప్రకటించడం మాదరి శ్రీనివాస్ వినూత్న ప్రయత్నంగా కనిపిస్తోంది. తన హామీలను నెరవేర్చేందుకు గ్రామ ప్రజల సహకారంతో వారి భూమిని కొనుగోలు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. మాదాపూర్ గ్రామ ఓటర్లు ఈ మేనిఫెస్టోను ఏ మేరకు విశ్వసిస్తారు, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ALSO READ: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో అఖిలేష్ యాదవ్ భేటీ.. ఏం మాట్లాడుకున్నారంటే..?