Indigo Flight Cancellations: అయ్యప్ప దర్శనార్థం సబరిమలకు వెళ్లేందుకు సిద్ధమైన భక్తులకు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆకస్మికంగా రద్దు కావడంతో ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న సాయంత్రం నుంచే కొచ్చీకి వెళ్లేందుకు భారీ సంఖ్యలో భక్తులు విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, విమానాలు రద్దు అయ్యాయని అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్కు చేరుకున్న అయ్యప్ప భక్తులు విమానాలు రద్దయ్యాయని చెబుతుంటే నమ్మలేకపోయారు. ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే మేమూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవాళ్లం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానాల రద్దు నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన భక్తులు.. బోర్డింగ్ గేట్ వద్దే ఆందోళన చేశారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో ఎయిర్పోర్ట్లో భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో.. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిన్న సాయంత్రం నుండి ఎయిర్ లైన్స్ ఆధికారులు.. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యప్ప మాలాధారణ చేసి సబరిమలయాత్రకు బయలుదేరిన భక్తులకు.. ఈ విధంగా ఇబ్బందులు రాకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
మొత్తం మీద, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొన్న ఈ ఘటనపై ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ఇన్ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్కు వెళ్లాల్సినవి ఉన్నాయి.
Also Read: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన