Panchayat Elections: సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ, దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఓ వినూత్న ప్రచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ గ్రామస్థులను ఆకట్టుకుంటోంది. తమ భార్యను వార్డు మెంబర్గా గెలిపిస్తే, ఐదేళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని భర్త ప్రకటించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సంఘటన దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఆరో వార్డు మెంబర్ అభ్యర్థిగా శివాని పోటీ చేస్తున్నారు. ఆమె భర్త శ్రీకాంత్ వృత్తిరిత్యా క్షౌరకారుడు (బార్బర్). ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా చేయాలనే ఉద్దేశంతో శ్రీకాంత్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన భార్య శివానిని వార్డు మెంబర్గా గెలిపిస్తే, ఐదేళ్ల పాటు ఆ వార్డులోని ప్రజలందరికీ ఉచితంగా కటింగ్, షేవింగ్ సేవలు అందిస్తానని బహిరంగంగా ప్రకటించాడు.
ఈ హామీని శ్రీకాంత్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీ ఒక్క ఓటుతో మా కుటుంబానికి కాకుండా, మీ అందరికీ ఐదేళ్ల పాటు ఉచిత సేవలు అందిస్తాను. నా భార్యను గెలిపిస్తే మీకు నేను బార్బర్గా సేవలందిస్తాను అంటూ ప్రచారం చేయడం గ్రామస్తుల్లో ఆసక్తికర స్పందనను తీసుకువచ్చింది. ఈ వినూత్న ప్రచారం సామాన్య ఓటర్లను సైతం ఆకట్టుకుంటుందని స్థానికులు అంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు రఘోత్తంపల్లి గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇతర గ్రామాల కంటే భిన్నంగా ఇక్కడ ప్రచారం కొంత వినోదాత్మకంగా సాగుతోంది.
Also Read: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే ముమ్మర ప్రచారం
మొత్తానికి దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ వినూత్న ప్రచారం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గెలుపు తర్వాత నిజంగా ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ జరుగుతుందా? ఈ హామీ ఓట్లపై ఎంత ప్రభావం చూపుతుందా? అన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలిపోతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.