Panchayat Elections: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో బరిలో నిలిచిన ప్రధాన అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఎన్నికల గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో నేటి నుంచే ముమ్మరంగా ప్రచార పర్వం ప్రారంభంకావటంతో గ్రామాలు రాజకీయ సందడితో మార్మోగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన 503 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు మొత్తం 1784 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 3796 వార్డు స్థానాలకు 9250 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటికే 52 సర్పంచ్ స్థానాలు, 1132 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా తీర్మానమయ్యాయి.
వరంగల్ జిల్లాలో మొత్తం 91 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 సర్పంచ్ స్థానాల కోసం 305 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 800 వార్డు స్థానాల్లో 215 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 585 వార్డు స్థానాలకు 1427 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రామస్థాయిలో ప్రచారంలో తలమునకలయ్యాయి.
హనుమకొండ జిల్లాలో 69 సర్పంచ్ స్థానాలు ఉండగా, 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 65 సర్పంచ్ స్థానాలకు 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 658 వార్డు స్థానాల్లో 153 స్థానాలు ఏకగ్రీవంగా తేలగా, మిగిలిన 505 వార్డు స్థానాలకు 1339 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రివరకూ ప్రచారం కొనసాగుతోంది.
జనగామ జిల్లాలో మొత్తం 110 సర్పంచ్ స్థానాలు ఉండగా, అందులో 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 100 పంచాయతీలకు 340 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1024 వార్డు స్థానాల్లో 228 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 785 వార్డు స్థానాలకు 1893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా అభివృద్ధి, త్రాగునీరు, డ్రైనేజ్, రహదారులు వంటి సమస్యలే ప్రచారంలో కీలకాంశాలుగా మారాయి.
ములుగు జిల్లాలో 48 సర్పంచ్ స్థానాలకు 9 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 39 సర్పంచ్ స్థానాలకు 145 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 420 వార్డు స్థానాల్లో 120 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 287 వార్డు స్థానాలకు 753 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అడవి ప్రాంతాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి అంశం ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 82 సర్పంచ్ స్థానాలకు 9 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 73 సర్పంచ్ స్థానాలకు 262 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 712 వార్డు స్థానాల్లో 150 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 562 స్థానాలకు 1447 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
Also Read: తెలంగాణ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లు హ్యాక్
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 155 సర్పంచ్ స్థానాలు ఉండగా, అందులో 9 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1338 వార్డు స్థానాల్లో 266 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1072 స్థానాలకు 2391 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామాల్లో ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 25 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. చొప్పదండి మండలంలోని దేశాయిపేట,పెద్దకురుమపల్లి, రామడుగు మండలంలోని శ్రీరాముల పల్లి ఏకగ్రీవం అయ్యాయి.
పెద్దపల్లి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జగిత్యాల జిల్లాలో 9 గ్రామపంచాయతీలు ఏకగీవ్రంగా తీర్పు నిచ్చాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా 9 సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రజలు. 9 తండాల్లో సర్పంచ్లను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల ప్రచారం పర్వం ఊపందుకుంది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటించారు అధికారులు. అభ్యర్థుల గుర్తులను కేటాయించారు. మొదటి విడతలో 184 పంచాయితీలకు 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. చాలా చోట్ల బరిలో ఒక్కరే మిగలడంతో వారు ఏకగ్రీవమయ్యారు. చివరి వరకు ప్రత్యర్థులు బరిలో నిలిచి.. బుజ్జగింపులు, ఇతర కారణాలతో పోటీ నుంచి తప్పుకొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 21 గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఖమ్మం జిల్లాలో 19 సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదటి దశలో 192 గ్రామపంచాయ తీలకు ఈనెల 11న పోలింగ్ జరగాల్సి ఉంది. నిన్న ఉపసంహరణ ముగియటంతో 19 గ్రామ పంచాయతీలు, 220 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 173 గ్రామ పంచాయతీల్లో సర్పంచి స్థానాలకు, 15 వందల 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 159 సర్పంచ్ స్థానాలకు.. 813 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 47 స్థానాలు సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయి. 14వందల 36 వార్డు మెంబర్స్ స్థానాలకు 3 వేల 480 నామినేషన్లు రాగా, 688 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
నల్లగొండ జిలాలో 10 గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి.