POCSO Probe: స్వేచ్ఛ బ్యూరో: బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ అధికారులు నేడు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. అదే సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రితోపాటు బీజేపీ పార్టీకి చెందిన సంగప్పను కూడా ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. బండి భగీరథ్ స్నేహితుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకోనున్నట్టు తెలియవచ్చింది. మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ పలుమార్లు లైంగిక దాడులు జరిపినట్టుగా ఓ మహిళ ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ తోపాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతరం బండి భగీరథ్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు అతన్ని నార్సింగి ప్రాంతంలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ ప్రకటించారు. అయితే, బండి భగీరథ్ ను సరెండర్ చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
ఇదిలా ఉండగా తన కూతురికి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంట్లో 2025, డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి ఆ మరుసటి రోజు తెల్లవారుఝాము వరకు మొయినాబాద్ లో జరిగిన సంఘటనలను ఆమె ప్రస్తావించారు. ఆ సమయంలో ఫార్మ్ హౌస్ లో పది మంది బండి భగీరథ్ స్నేహితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారి పేర్లను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు కూడా. ఇక, మార్చి, ఏప్రిల్ నెలల్లో చట్టపరమైన చర్యలకు తాము సిద్దం కాగా పరోక్షంగా ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిపారు.
ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడినట్టుగా కూడా బాధితురాలి తల్లి లేఖలో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజున తాము కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసినట్టుగా తెలియచేశారు. భరోసా కోసం వెళ్లిన తమను భయపెట్టారని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు బాధితురాలి ఇంటికి వెళ్లిన సంగప్పతోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కూడా దీనిపై ప్రశ్నించాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: తెలంగాణ భూభాగంలో.. మరాఠా మాఫియా అరాచకం..!
అదే సమయంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరుసటి రోజు తెల్లవారుఝాము వరకు ఫార్మ్ హౌస్ లో బాధితురాలితోపాటు బండి భగీరథ్ వెంట ఉన్న అతని స్నేహితుల నుంచి సోమవారం కొంతవరకు సమాచారాన్ని సేకరించి రికార్డు చేసినట్టుగా తెలిసింది. ఈ విచారణ రెండున్నర గంటలకు పైగా జరిగినట్టు సమాచారం.
ఇక, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జడ్జి మాధవీ దేవిపై కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఆదివారం ఫిర్యాదు చేయగా చార్మినార్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. విచారణ చేపట్టి ఆంధ్రప్రదేశ్ కు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి దక్కుతుందని దామోదర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడున. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీసేలా పోస్ట్ పెట్టినందుకు దామోదర్ ను అరెస్ట్ చేశారు.
నిన్న మొన్నటి వరకు ఖరీదైన కార్లు..చుట్టూ పది మంది స్నేహితులు..విందులు, వినోదాలతో గడిపిన బండి భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లోని మహానంది బ్లాక్ లో ఒంటరిగా ఉంటున్నాడు. బ్యారక్ లోని మిగితా ఖైదీలతో మాట్లాడటానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలిసింది.
Also read: మూడు సార్లు గాయాలు.. త్వరలోనే సర్జరీ.. ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టిన మెగా పవర్ స్టార్