ఫోన్ ట్యాపింగ్ విచారణ కేసులో సిట్ దూకుడు పెంచింది. వచ్చేనెల రెండో వారంలోగా విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయడానికి సిట్ సన్నద్దం అవుతున్నది.ఈ క్రమంలోనే శరవేగంగా ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా నిన్న రాత్రి బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణ కోసం జూబ్లీహిల్స్ పీఎస్లో హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ముందుగా అనుకున్నట్టు గానే బీఆర్ఎస్ కీలకనేతలైన హరీశ్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
ప్రస్తుతం సిట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. హరీశ్ రావు, కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన సమయంలో తమకు ఈ కేసుకు ఏంటి సంబంధం? తాను అప్పుడు హోంమంత్రిగా లేనని హరీశ్ చెప్పగా.. మాజీ ఎస్ఐబీ అధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిలను పిలిచి విచారించాలని ఆ వ్యవహారం అంతా వారికి తెలియకుండా జరుగుతుందా? అని కేటీఆర్ సిట్ అధికారులకు వివరించినట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి రాజ్యసభ ఎంపీగా ఉన్న జోగిని పల్లి సంతోష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆయన సేట్ట్మెంట్ కోసం సాక్షిగా విచారణకు పిలిచారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
సంతోష్ రావు విచారణలో భాగంగా తనకు ఈ కేసుకు ఏం సంబంధం లేదని.. తానూ బాధితుడినేనని చెబుతారా? హరీశ్ రావు, కేటీఆర్లకే అంతా తెలుసునని వారి మీదే నెపం వేస్తారా? అని ప్రస్తుతం గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావులతో సంతోష్కు పెద్దగా మాటలు లేవని తెలుస్తున్నది. కల్వకుంట్ల ఫ్యామిలీ ముక్కలు కావడంతో సంతోష్ పాత్ర కూడా ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన.. బావబామ్మర్దులను ఇరికిస్తారా? అని ప్రచారం జరుగుతోంది.
Pawan Kalyan: ఆ దుష్టశక్తులు ఎవరు? పవన్ వ్యాఖ్యల వెనుక అసలు గుట్టు!
కేటీఆర్, హరీశ్ రావు విచారణల అనంతరం ఊహించినట్టుగానే సంతోష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది. ఆయన తర్వాత కల్వకుంట్ల కవిత, ఆయన భర్తకు సిట్ నోటీసులు ఇవ్వనుందని ప్రచారం జరగుతోంది. ఎందుకంటే తన భర్త ఫోన్ ట్యాప్ జరిగిందని కవిత ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు కవితకు సైతం నోటీసులు ఇచ్చి నిందితుల గుట్టు లాగాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం హరీశ్ రావు మీద కవితకు పీకలదాకా కోపం ఉన్నది. తనను పార్టీ నుంచి పంపించివేయడానికి ఆయన కుట్ర పన్నారని ఆమె ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే హరీశ్ రావును ఈ కేసులో కవిత ఇరికిస్తారా? అనే ఊహగానాలు కూడా ప్రారంభం మయ్యాయి. మొత్తానికి బావబామ్మర్దుల అరెస్టు తప్పదా? అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.