Uttam Kumar Reddy: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులపై.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఒప్పందాల అమలు, టన్నెల్ తవ్వకం పునఃప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై ఆయన అధికారులను, కాంట్రాక్టర్ సంస్థను తీవ్రంగా నిలదీశారు. పనులు పూర్తి చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారు? మీకు భయమైతే చెప్పండి.. దస్త్రాలపై నేను సంతకం చేస్తాను అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం తదితర జిల్లాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో దీన్ని చేపట్టారు. అయితే, టన్నెల్ తవ్వకాల్లో గతంలో జరిగిన ప్రమాదాలు, కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యం, నిధుల సమస్యల కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది.
ఇటీవల జేపీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో ఇప్పటివరకు ఎంతో ఓపిక పట్టాం. కానీ ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఒప్పందం ప్రకారం టన్నెల్ తవ్వకం పనులు వెంటనే పునఃప్రారంభించాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ జేపీ అసోసియేట్స్ను హెచ్చరించారు.
ఒప్పందం ప్రకారం ఎక్స్క్రో అకౌంట్ను సంస్థ వెంటనే తెరవాలని మంత్రి ఆదేశించారు. పనులు పూర్తయ్యాక బిల్లులు సమర్పిస్తే యుద్ధప్రాతిపదికన చెల్లింపులు చేస్తామని, కానీ పనులు చేయకుండా ముందుగా బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదు. ప్రజల డబ్బుతో చేసే పనుల్లో బాధ్యత తప్పనిసరి అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో జేపీ అసోసియేట్స్ ప్రతినిధి ముందుగా చెల్లింపులు చేసి, తర్వాత రికవరీ చేసుకోవాలని సూచించగా, దీనిపై మంత్రి ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. మా మంచితనాన్ని బలహీనతగా భావించవద్దు. ఒప్పందానికి అనుగుణంగానే చెల్లింపులు ఉంటాయి. ఇక మేం ఊరుకోం అంటూ తేల్చి చెప్పారు.
వారంలోపు డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం పనులు.. పూర్తి స్థాయిలో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిని రోజువారీగా సమీక్షిస్తామని, ఎలాంటి జాప్యం జరిగినా బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా ఇదే తరహాలో స్పందించారు. పనులు ప్రారంభించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Also Read: జయత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్ట్
దీనికి ప్రతిగా జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు స్పందిస్తూ, టన్నెలింగ్ తవ్వకం పనులు ఇప్పటికే ప్రారంభించామని, ఇకపై మరింత వేగం పెంచి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం విధించిన గడువుల ప్రకారం పనులు పూర్తి చేస్తామని తెలిపారు.