Free Launch Offer Scam: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వందల కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ సామాన్య ప్రజలను, మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించి.. భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఈడీ కీలక ముందడుగు వేసింది.
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన కాకర్ల శ్రీనివాస్, “ఫ్రీ లాంచ్ ఆఫర్” అంటూ వినూత్న ప్రచారం చేశాడు. ముందుగా డబ్బులు చెల్లిస్తే తక్కువ ధరకు ఇళ్లు ఇస్తామని, త్వరలోనే ప్రాజెక్టులు పూర్తవుతాయని హామీలు ఇచ్చి, వేలాది మంది గృహ కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
డబ్బులు వసూలు చేసిన అనంతరం హామీ ఇచ్చిన విధంగా ఇళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడమే కాకుండా, కొన్నిచోట్ల అసలు నిర్మాణమే ప్రారంభించలేదని ఈడీ గుర్తించింది. వసూలు చేసిన సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించడం, వ్యక్తిగత ఖర్చులు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా వినియోగించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు సుమారు రూ.300 కోట్ల రూపాయల వరకు మోసం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన ఈడీ, మరింత మొత్తం బయటపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభించగానే కాకర్ల శ్రీనివాస్ పరారీలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అతని కదలికలపై నిఘా పెట్టిన ఈడీ బృందం, చెన్నైలో ఉన్నట్లు సమాచారం అందడంతో.. అక్కడ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. చెన్నైలో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, అనంతరం అతడిని హైదరాబాద్కు తరలించారు. ఈ అరెస్ట్తో ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు.
ఈడీ అధికారులు కాకర్ల శ్రీనివాస్ను విచారించగా, ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఎలా ప్రచారం నిర్వహించాడన్నది, ఎంతమంది నుంచి ఎంత మొత్తం వసూలు చేశాడన్న అంశాలపై కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలు, ఖాతాల వివరాలు, షెల్ కంపెనీల వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బాధితుల నుంచి ఈడీ వాంగ్మూలాలు సేకరించింది. ఇంకా చాలా మంది బాధితులు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తున్నారని సమాచారం.
ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ, పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులు, నగదు, స్థిరాస్తులపై అటాచ్మెంట్ చర్యలు చేపట్టే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.
Also Read: ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
మరికాసేపట్లో కాకర్ల శ్రీనివాస్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి కస్టడీ అనుమతి తీసుకుని మరింత లోతైన విచారణ చేపట్టాలని ఈడీ భావిస్తోంది. ఈ విచారణలో మరికొందరు కీలక వ్యక్తులు, సహనిందితులు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.