తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. నిత్యం రాజకీయ కార్యకలాపాలతో, కార్యకర్తల తాకిడితో కిటకిటలాడే ఈ భవన ప్రాంగణంలో ఊహించని విధంగా ఒక పెద్ద పాము ప్రత్యక్షం కావడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.
సాధారణంగా గాంధీ భవన్ ఎప్పుడూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయింది. అయితే, నేడు సంక్రాంతి పండుగ కావడంతో కార్యాలయంలో సందడి తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కార్యాలయ ప్రాంగణంలో ఒక భారీ పాము నెమ్మదిగా పాకుతూ కనిపించింది.
అది చాలా పొడవుగా, లావుగా ఉండటంతో అక్కడ ఉన్న కొద్దిపాటి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. నిజానికి, ఇది సాధారణ రోజు అయి ఉంటే గాంధీ భవన్కు వందల సంఖ్యలో కార్యకర్తలు వచ్చేవారు. జనాల మధ్య ఈ పాము వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఎవరో ఒకరిపై దాడి చేసే అవకాశం ఉండేదని అక్కడి వారు చర్చించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సెలవు కావడంతో జనసమ్మర్థం లేకపోవడం వల్లే ఎటువంటి ప్రాణాపాయం కలగలేదని, ఒక రకంగా పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పాతబస్తీ సమీపంలోని నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ చుట్టూ కొంత మేర పాత కట్టడాలు, చెట్లు ఉండటంతో పాములు వచ్చే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ.. ఇంత పెద్ద పాము రావడం ఇదే మొదటిసారి అని కొందరు అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రాంగణం అంతా బ్లీచింగ్, క్లీనింగ్ పనులు చేపట్టాలని నాయకులు సూచించారు.
చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: Palnadu news: ఎస్ఐ వాహనం బీభత్సం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు