పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగాజజ మరొకరిని ఆస్పత్రి పాలు చేసింది. ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య తన వాహనంలో వెళ్తుండగా చిలకలూరిపేట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఐ నిద్రమత్తులో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిద్రమత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయిన ఆయన, ఎదురుగా వస్తున్న రెండు బైకులను వేగంగా ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీస్ అధికారి అయ్యుండి ఇలా అజాగ్రత్తగా వాహనం నడపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిద్రమత్తులో ఉంటే వాహనం నడపకుండా ఉండాల్సిందని, ఆయన నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని బాధితుడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.