SP Balasubrahmanyam Statue: దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 15న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి జూపల్లి, నటుడు శుభలేఖ సుధాకర్ విగ్రహ ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తెలంగాణ వాదులు బాలు విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక వేదికలో ఆంధ్రాకు చెందిన వ్యక్తికి చోటు కల్పించడం సరికాదంటున్నారు. గద్దర్, అందె శ్రీ లాంటి తెలంగాణ వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలే తప్ప, తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని పెట్టడానికి వీళ్లేదంటున్నారు. ఈ వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా, సాంస్కృతిక సమూహాలలో చర్చకు దారితీసింది. ఇంకా చెప్పాలంటే ఈ చర్చ విగ్రహం దాటి ప్రాంతీయ వాదనగా మారింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైన సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘జయ జయహే తెలంగాణ’ పాటను పాడటానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ అంశాన్ని తెలంగాణ వాదులు ఇప్పుడు ముందు పెట్టి.. ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టకూడదంటున్నారు. తెలంగాణ విషయంలో ఏనాడు అనుకూలంగా మాట్లాడని వ్యక్తికి, తెలంగాణ సాంస్కృతిక వేదికలో స్థానం కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు సంగీతం, భారతీయ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషి సాటిలేనిది. ఆయన సంగీత ప్రపంచానికి చేసిన కృషికి గౌరవంగా, చెన్నైలోని ఓ వీధికి ఇటీవల ఆయన పేరు పెట్టారు. కర్నాటకలోనూ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తోటి తెలుగు రాష్ట్రంలో ఆయన అగౌరవాన్ని ఎదుర్కొంటున్నాడని పలువురు సంగీతకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నాయంటూ తెలుగు చిత్ర పరిశ్రమ అధికారికంగా నివాళులు అర్పించలేదు. లాక్ డౌన్ అయ్యాక కూడా ఎవరూ ఆయనను గుర్తు చేసుకోలేదు. నిజానికి చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆయన పాటలతో కెరీర్ లను నిర్మించుకున్నారు. ఆయన స్వరం ద్వారా మంచి లాభాన్ని పొందారు. కానీ, ఆయన చనిపోయినప్పుడు అటు వైపు చూడలేదు కూడా. ఇప్పుడు ఆయన విగ్రహంపైనా వివాదం కొనసాగుతోంది.
నిజానికి ఒక విగ్రహం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఖ్యాతిని మార్చదు. ఆయన స్థాయిని పెంచదు. భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం అయిన వ్యక్తిని తిరస్కరించడం తెలంగాణకే మంచిది కాదనే వాదన వినిపిస్తుంది. తెలంగాణను ఏనాడు ఆయన వ్యతిరేకించిన సందర్భాలు లేవంటున్నారు. ఆయనకు గౌరవం ఇవ్వడం అంటే, కళను గౌరవించడమే అవుతుందంటున్నారు. ఆయనను ప్రాంతానికి అతీతంగా చూడాలని కళాకారులు సూచిస్తున్నారు. ప్రాంతం, మతం అంటూ ఆయన మీద వ్యతిరేకతను వెళ్లగక్కడం మన రాష్ట్రానికే గౌరవాన్ని తగ్గిస్తుందంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటల ద్వారా ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచే ఉంటాడని.. ఆయనకు విగ్రహం పెట్టడం అంటే కళకు మనం ఇచ్చే గౌరవం అవుతుందంటున్నారు. ఒకవేళ పెట్టనివ్వం అంటే ఆయన ఇప్పటికే సంపాదించిన కీర్తికి.. ఈ విగ్రహం అదనంగా జోడించే గౌరవం ఏమీ ఉండదని తెలుసుకోవాలంటున్నారు.
Read Also: హైదరాబాద్లో అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన మహిళా వ్యాపారవేత్త, కారణం ఇదేనట!