Logistics Growth: గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’కు హాజరై మాట్లాడారు. ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. సముద్ర తీరం లేని రాష్ట్రాల (ల్యాండ్లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉందన్నారు. మర్చండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు.
‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక మైనస్ గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నామన్నారు. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామన్నారు. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
Also Read: ఛత్తీస్గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ – ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
Also Read: తెలంగాణలో పవన్ పోటీ చేయెుచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి